రిపబ్లిక్‌ డే మెగా సేల్స్‌ : అసలు విజేతెవరు?

25 Jan, 2018 15:28 IST|Sakshi

ముంబై : అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌, దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ రెండూ తమ తొలి బిగ్‌ ఆన్‌లైన్‌ సేల్‌ను విజయవంతంగా పూర్తిచేసుకున్నాయి. రిపబ్లిక్‌ డే సందర్భంగా అమెజాన్‌ 'గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌' ను నిర్వహించగా... ఫ్లిప్‌కార్ట్‌ 'రిపబ్లిక్‌ డే సేల్‌' నిర్వహించింది. ఈ రెండు దిగ్గజాలు నిర్వహించిన సేల్‌లో విజేతలు తామెంటే తామని ప్రకటనలు ఇచ్చేసుకుంటున్నాయి. తమ ప్రత్యర్థి కంటే రెండింతల విక్రయ ఆర్డర్లను నమోదుచేసినట్టు అమెజాన్‌ ప్రకటించగా.. 60 శాతం నుంచి 65 శాతం వరకు మార్కెట్‌ షేరుతో తాము ముందంజలో ఉన్నామని ఫ్లిప్‌కార్ట్‌ చెబుతోంది. ఇంతకీ విజేత ఎవరంటే? చెప్పడం కష్టంగానే మారింది. కాగ, అమెజాన్‌ తన గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ను జనవరి 21 నుంచి బుధవారం రాత్రి వరకు నిర్వహించింది. ఫ్లిప్‌కార్ట్‌ జనవరి 21 నుంచి జనవరి 23 వరకు ఆఫర్లు కురిపించింది. 

200 నగరాల్లో 32వేల ఆన్‌లైన్‌ వినియోగదారులు నమోదైనట్టు కాంటర్‌ ఐఎంఆర్‌బీ సర్వేలో తేలింది. అంతేకాక తాము తమ ప్రత్యర్థి కంటే రెండింతల ఎక్కువ ఆర్డర్లతో అ‍త్యధిక షేరును దక్కించుకున్నామని అమెజాన్‌ పేర్కొంది. కొత్త కస్టమర్లను ఎక్కువగా పొందామని, 85 శాతం కొత్త కస్టమర్లు తమకు టైర్‌ 2, 3 పట్టణాల నుంచి వచ్చినట్టు అమెజాన్‌ ఇండియా కేటగిరి మేనేజ్‌మెంట్‌ వైస్‌-ప్రెసిడెంట్‌ మనీష్‌ తివారీ చెప్పారు. స్థూల సరుకుల విలువలో స్మార్ట్‌ఫోన్లు అతిపెద్ద కేటగిరీగా ఉన్నాయని, సాధారణ రోజుల కంటే ఆరింతలు జంప్‌ చేసిందని తివారీ తెలిపారు. పెద్ద పెద్ద ఉపకరణాలు విక్రయాలు కూడా భారీగా పెరిగాయన్నారు. 

అయితే అమెజాన్‌ ప్రకటనకు ఫ్లిప్‌కార్ట్‌ సీనియర్‌ డైరెక్టర్‌ స్మృతి రవిచంద్రన్ కౌంటర్‌ ఇచ్చారు. దేశీయ అతిపెద్ద ఈ-కామర్స్‌ ప్లేయర్‌గా ఫ్లిప్‌కార్ట్‌ తన స్థానాన్ని కొనసాగిస్తుందని, మూడు రోజుల రిపబ్లిక్‌ డే సేల్‌ సందర్భంగా ఈ-టైల్‌ మార్కెట్‌లో 60 నుంచి 65 శాతం షేర్‌ను తాము పొందినట్టు పేర్కొన్నారు. అమెజాన్‌తో, ఫ్లిప్‌కార్ట్‌కు గట్టిపోటీ ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఇరు కంపెనీలు తమ మౌలిక సదుపాయాలను, డెలివరీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి బిలియన్‌ డాలర్లను వెచ్చిస్తున్నాయి.   

మరిన్ని వార్తలు