అమెజాన్‌ గ్లోబల్‌ సెల్లింగ్‌లో దేశీ సంస్థల హవా

17 Nov, 2023 08:07 IST|Sakshi

న్యూఢిల్లీ: హాలిడే సీజన్‌ సందర్భంగా బ్లాక్‌ ఫ్రైడే, సైబర్‌ మండే సేల్‌లో భారతీయ వ్యాపార సంస్థలు పెద్ద యెత్తున పాల్గొంటున్నట్లు ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తెలిపింది. నవంబర్‌ 17 నుంచి 27 వరకు జరిగే ఈ ఈవెంట్‌ కోసం తమ గ్లోబల్‌ వెబ్‌సైట్‌లో 50,000 పైచిలుకు కొత్త ఉత్పత్తులు ఆవిష్కరించినట్లు వివరించింది.

తద్వారా లక్షల సంఖ్యలో మేడిన్‌ ఇండియా ఉత్పత్తులు తమ సైట్‌లో అందుబాటులో ఉండనున్నట్లు అమెజాన్‌ తెలిపింది. కొత్తగా గ్లోబల్‌ సెల్లింగ్‌ ప్రోగ్రామ్‌లో చేరిన ఎగుమతిదారులకు తాము రుసుములను కూడా తగ్గిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. తొలి మూడు నెలలకు చందా రుసుమును 120 డాలర్ల నుంచి కేవలం 1 డాలరుకు తగ్గించినట్లు తెలిపింది.

భారతీయ ఎగుమతిదారులకు వ్యాపారంలో ప్రధాన భాగం అమెరికా, బ్రిటన్‌ మార్కెట్ల నుంచి ఉంటోందని.. కొత్తగా జపాన్, ఆస్ట్రేలియా మార్కెట్లు కూడా జతవుతున్నాయని కంపెనీ వివరించింది. హోమ్, బ్యూటీ, కిచెన్, ఫర్నిచర్‌ వంటి కేటగిరీల్లో అత్యధిక అమ్మకాలు ఉంటున్నాయని పేర్కొంది. 

మరిన్ని వార్తలు