ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి శాటిలైట్‌ ఫోన్లు

25 May, 2017 00:15 IST|Sakshi
ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి శాటిలైట్‌ ఫోన్లు

మొదట ప్రభుత్వ ఏజెన్సీలకు; తరవాత ఇతరులకు  
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజ టెలికం కంపెనీ ‘బీఎస్‌ఎన్‌ఎల్‌’ తాజాగా శాటిలైట్‌ ఫోన్‌ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇంటర్నేషనల్‌ మొబైల్‌ శాటిలైట్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎన్‌ఎంఏఆర్‌ఎస్‌ఏటీ) ద్వారా ఈ సేవలను తొలిగా గవర్నమెంట్‌ ఏజెన్సీలకు అందుబాటులోకి తెస్తామని కంపెనీ తెలిపింది. తర్వాత ఇతరులకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొంది. స్టేట్‌ పోలీస్, రైల్వేస్, సరిహద్దు భద్రతా దళం, ఇతర ప్రభుత్వ సంస్థలకు తొలిగా ఫోన్లను అందిస్తామని టెలికం మంత్రి మనోజ్‌ సిన్హా తెలిపారు.

తర్వాత ఫ్లైట్స్, షిప్స్‌లో ప్రయాణించేవారు ఈ ఫోన్లను ఉపయోగించుకోవచ్చన్నారు. వాయిస్, ఎస్‌ఎంఎస్‌ ఫీచర్‌లతో తాము తాజాగా శాటిలైట్‌ మొబైల్‌ సర్వీస్‌ను ప్రారంభించామని బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ అనుపమ్‌ శ్రీవాత్సవ తెలిపారు. ప్రస్తుతం టాటా కమ్యూనికేషన్స్‌ శాటిలైట్‌ ఫోన్లను అందిస్తోందని, దీని సర్వీసులు జూన్‌ 30 నాటికి ముగుస్తాయన్నారు. అన్ని కనెక్షన్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కు బదిలీ అవుతాయని, కాల్‌ చార్జీలు నిమిషానికి రూ.30–రూ.35 శ్రేణిలో ఉండొచ్చని ఐఎన్‌ఎంఏఆర్‌ఎస్‌ఏటీ ఇండియా ఎండీ గౌతమ్‌ శర్మ తెలిపారు. 

మరిన్ని వార్తలు