ట్యాక్స్‌ పేయర్లకు గుడ్‌న్యూస్‌

4 Jan, 2018 10:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం 2018 బడ్జెట్‌లో గుడ్‌న్యూస్‌ చెప్పబోతుంది.  పాపులర్‌ ''సెక్షన్‌ 80సీ'' స్కీమ్‌ కింద పెట్టుబడుల పరిమితిని ఏడాదికి రూ.2,00,000లకు పెంచాలని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నిర్ణయిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో రూ.2 లక్షల వరకున్న బ్యాంకు డిపాజిట్లు, ఇన్సూరెన్స్‌ ప్రీమియం, మ్యూచువల్‌ ఫండ్స్‌ వంటి పెట్టుబడులకు పన్ను చెల్లించవసరం లేదు. ఇప్పటి వరకున్న నిబంధన ప్రకారం  ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80 సీ కింద ప్రాఫిడెంట్‌ ఫండ్‌, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్స్‌, ఐదేళ్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పిల్లల ట్యూషన్‌ ఫీజు, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, స్పెషిఫిక్‌ మ్యూచవల్‌ ఫండ్స్‌, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలో పెట్టుబడి పెట్టే మొత్తంలో రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు ఉంది. 

ఒకవేళ ఇది కనుక అమలైతే, ఫైనాన్సియల్‌ ఇన్‌స్ట్రుమెంట్లలో ప్రజలు పొదుపు చేయడం పెరుగుతుందని తెలిసింది. ఈ పన్ను మినహాయింపును పెంచిన అనంతరం ఒకవేళ మీ స్థూల వార్షికాదాయం రూ.10 లక్షలుంటే, దానిలో సెక్షన్‌ 80సీ కింద ఇన్‌స్ట్రుమెంట్లలో పెట్టే పెట్టుబడులు రూ.2 లక్షలుంటే, కేవలం రూ.8 లక్షలకు మాత్రమే మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.  ప్రస్తుతమున్న రూ.1.5 లక్షల పరిమితి 2014-15 నుంచి కొనసాగుతూ వస్తోంది. జైట్లీ తన తొలి బడ్జెట్‌ 204-15లోనే ఈ పరిమితిని రూ.50వేల నుంచి లక్షన్నరకు పెంచారు. ప్రస్తుతం మరోసారి ఈ పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని అరుణ్‌ జైట్లీ యోచిస్తున్నారు. ఇటీవల బ్యాంకుల టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లు, ఫైనాన్సియల్‌ ఇన్‌స్టిట్యూషన్లతో  అరుణ్‌జైట్లీ నిర్వహించిన మీటింగ్‌లో దీనిపై చర్చించినట్టు తెలిసింది. 

మరిన్ని వార్తలు