సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనంతో కుదేలైన చిన్న మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లకు ఊతమిచ్చేలా రానున్న బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రూ 5000 కోట్లతో డిస్ర్టెస్డ్ అసెట్ ఫండ్ను ప్రకటించే అవకాశం ఉంది. ఎంఎస్ఎంఈ రంగంలో పెట్టుబడులకు ఆసక్తి కనబరిచే ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, కార్పొరేట్ల కోసం ప్రభుత్వం రూ 10,000 కోట్లతో ఓ నిధిని బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించవచ్చని భావిస్తున్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల పునరుత్తేజం కోసం సెబీ మాజీ చీఫ్ యూకే సిన్హా నేతృత్వంలో ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీ ఈ నిధుల ఏర్పాటుకు సిఫార్సు చేసింది. ఈ రెండు ఫండ్స్ను బడ్జెట్ సమావేశాల్లో ఆమోద ముద్ర పొందిన తర్వాత వీటి అమలుకు కార్యాచరణను రూపొందిస్తారు. ఈ నిధి నుంచి చిన్న పరిశ్రమలు లబ్ధి పొందేందుకు అవసరమైన విధివిధానాలకు రూపకల్పన చేస్తారు. కరువు, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతినే చిన్న వ్యాపారులను ఈ నిధి ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుంది. దేశవ్యాప్తంగా విస్తరించిన 6.3 కోట్ల ఎంఎస్ఎంఈలు దేశ జీడీపీకి 29 శాతం సమకూరుస్తున్నాయి. ఎంఎస్ఎంఈల్లో దాదాపు 12 కోట్ల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.