ఎయిరిండియా చీఫ్‌గా అశ్వని లొహానీ

21 Aug, 2015 00:46 IST|Sakshi
ఎయిరిండియా చీఫ్‌గా అశ్వని లొహానీ

తొలిసారిగా రైల్వే అధికారికి విమాన పగ్గాలు
 
 న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా సీఎండీగా తొలిసారిగా ఒక రైల్వే శాఖకు చెందిన అధికారి నియమితులయ్యారు.   1980 బ్యాచ్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ (ఐఆర్‌ఎస్‌ఎంఈ) ఆఫీసర్ అయిన అశ్వని లొహానీ ఎయిర్‌ఇండియా చీఫ్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంపీటీడీసీ) ఎండీగా పనిచేస్తున్నారు. ఎయిరిండియా సీఎండీగా ఆయన పదవీ కాలం మూడేళ్ల పాటు ఉంటుంది. లొహానీ నియామకానికి క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదముద్ర వేసింది.

 ప్రస్తుతం ఎయిరిండియా సీఎండీగా 1982 బ్యాచ్ ఉత్తర ప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి రోహిత్ నందన్ విధులు నిర్వర్తిస్తున్నారు. నందన్ పదవీకాలం ఈ నెలతో ముగిసిపోనుంది. దాదాపు రూ. 30,000 కోట్ల నష్టాల భారంతో ఎయిరిండియా ఎదురీదుతున్న నేపథ్యంలో లొహానీ కీలక బాధ్యతలు చేపట్టనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

>
మరిన్ని వార్తలు