హైదరాబాద్‌లో క్లీన్‌ హార్బర్స్‌ కొత్త కార్యాలయం

14 Jan, 2020 05:53 IST|Sakshi
కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న అలెన్‌ మెక్‌కిమ్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎన్విరాన్‌మెంటల్‌ సేవల్లో ఉన్న యూఎస్‌ కంపెనీ క్లీన్‌ హార్బర్స్‌ హైదరాబాద్‌లో నూతన కార్యాలయం ఏర్పాటు చేసింది. 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హైటెక్‌ సిటీలో ఈ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ను (జీసీసీ) నెలకొల్పారు. ఉత్తర అమెరికా తర్వాత సంస్థకు ఇదే అతిపెద్ద జీసీసీ. 650 మంది కూర్చునే వీలుగా ఏర్పాటు ఉంది. ప్రస్తుతం ఇక్కడ 300 మంది ఉద్యోగులు ఉన్నారు. 12–18 నెలల్లో ఈ సంఖ్యను రెట్టింపు చేస్తామని క్లీన్‌ హార్బర్స్‌ చైర్మన్‌ అలెన్‌ మెక్‌కిమ్‌ సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు.

ఐటీ, హెచ్‌ఆర్, ఫైనాన్స్, లీగల్‌ విభాగాల్లో ఈ నియామకాలు ఉంటాయని వివరించారు. క్లీన్‌ హార్బర్స్‌కు ప్రపంచవ్యాప్తంగా 7,000 కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. హైదరాబాద్‌ సెంటర్‌ ఈ క్లయింట్లకు సేవలు అందిస్తుందన్నారు. కంపెనీ ఉత్పత్తులు, సేవలను భారత్‌లో పరిచయం చేసే విషయమై అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. నూతన కార్యాలయం కోసం రూ.30 కోట్లు వెచ్చించామని కంపెనీ కంట్రీ మేనేజర్‌ అవినాశ్‌ సామృత్‌ తెలిపారు. భారత్‌లో ఇప్పటి వరకు క్లీన్‌ హార్బర్స్‌ రూ.50 కోట్లు ఖర్చు చేసిందన్నారు.  
 

మరిన్ని వార్తలు