డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో  జీడీపీకి 154 బిలియన్‌ డాలర్లు

12 Apr, 2018 01:04 IST|Sakshi

టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ అంచనా

న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ జోరు కనిపిస్తోంది. 2021 నాటికి భారత్‌ జీడీపీకి డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ వల్ల 154 బిలియన్‌ డాలర్లు సమకూరుతాయని టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ పేర్కొంది. మైక్రోసాఫ్ట్, ఐడీసీ సంయుక్తంగా ‘అన్‌లాకింగ్‌ ద ఎకనమిక్‌ ఇంపాక్ట్‌ ఆఫ్‌ డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఇన్‌ ఆసియా పసిఫిక్‌’ పేరుతో సర్వే నిర్వహించాయి. ఇందులో ఇండియా, ఆసియా–పసిఫిక్‌ దేశాల్లో డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో చెప్పుకోదగ్గ పెరుగుదల కనిపించింది. ‘2017లో దేశ జీడీపీలో దాదాపు 4 శాతం డిజిటల్‌ ప్రొడక్ట్స్‌ సహా మొబిలిటీ, క్లౌడ్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వంటి డిజిటల్‌ టెక్నాలజీల వినియోగం ద్వారా ఏర్పడిన సర్వీసుల వల్ల వచ్చింది’ అని మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అనంత్‌ మహేశ్వరి తెలిపారు.

వచ్చే నాలుగేళ్లలో దేశ జీడీపీలో దాదాపు 60 శాతం డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ట్రెండ్‌తో అనుబంధం కలిగి ఉంటుందని అంచనా వేశారు. ‘డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఇండియా దూసుకెళ్తోంది. వివిధ ఆర్గనైజేషన్లు ఏఐ వంటి వర్ధమాన టెక్నాలజీల వినియోగానికి ప్రాధాన్యమిస్తున్నాయి. దీనివల్ల డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో బలమైన వృద్ధి నమోదు కానుంది’ అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు