ఫ్లిప్‌కార్ట్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌ భారీ పెట్టుబడి

11 Aug, 2017 01:13 IST|Sakshi
ఫ్లిప్‌కార్ట్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌ భారీ పెట్టుబడి

విజన్‌ ఫండ్‌ ద్వారా 2.5 బిలియన్‌ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్‌
సుమారు 20 శాతం వాటా సాఫ్ట్‌బ్యాంక్‌ చేతికి
అతి పెద్ద వాటాదారుల్లో ఒకటిగా హోదా


న్యూఢిల్లీ: దేశీ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో జపాన్‌కి చెందిన సాఫ్ట్‌ బ్యాంక్‌ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టింది. సాఫ్ట్‌ బ్యాంక్‌ తన విజన్‌ ఫండ్‌ ద్వారా 2.5 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.16,000 కోట్లు) ఇన్వెస్ట్‌ చేసింది. తద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో అతి పెద్ద ఇన్వెస్టర్లలో ఒకటిగా మారింది. భారతీయ కంపెనీలో ఈ స్థాయి పెట్టుబడులు రావడం ఇదే ప్రథమమని పేర్కొన్న ఫ్లిప్‌కార్ట్‌... ఇన్వెస్ట్‌మెంట్‌ మొత్తాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే పెట్టుబడి విలువ సుమారు 2.5 బిలియన్‌ డాలర్లు ఉంటుందని, ఇందులో 1.5 బిలియన్‌ డాలర్లు నేరుగా ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్వెస్ట్‌ చేయగా, మిగతా 1 బిలియన్‌ డాలర్లను టైగర్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ వాటాలో కొంత భాగాన్ని కొనుగోలు చేసేందుకు సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌ వెచ్చించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

టెక్నాలజీ సంస్థల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్న అత్యంత భారీ ఫండ్‌ అయిన సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌కి తాజా పెట్టుబడి ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో దాదాపు 20 శాతం వాటాలు దక్కినట్లని వివరించాయి. ‘50 కోట్ల మందికి పైగా ఇంటర్నెట్‌ యూజర్లున్న దేశీ ఇంటర్నెట్‌ మార్కెట్లో పుష్కలంగా వ్యాపార అవకాశాలున్నాయి. భారత ఈ–కామర్స్‌ మార్కెట్‌ ఏటా 30 శాతం పైగా వార్షిక వృద్ధి నమోదు చేయనుందని అంచనా‘ అని ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. మార్కెట్‌లో ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి తాజా నిధులు తోడ్పడతాయని వివరించింది. ‘ఫ్లిప్‌కార్ట్, భారత్‌.. చిరస్థాయిగా గుర్తుంచుకోతగ్గ డీల్‌ ఇది. అంతర్జాతీయంగా కొన్ని దేశాలు మాత్రమే అత్యుత్తమ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించగలవు‘ అని ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్, సచిన్‌ బన్సల్‌ పేర్కొన్నారు.

మరోవైపు, సాఫ్ట్‌బ్యాంక్‌ వ్యవస్థాపకుడు మసయోషి సన్‌... భారత్‌ను అవకాశాల గనిగా అభివర్ణించారు. టెక్నాలజీ ఊతంగా ప్రజలు మరింత సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు కృషి చేస్తున్న ఇలాంటి సృజనాత్మక సంస్థలకు తోడ్పడటమే తమ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ డీల్‌కు నియంత్రణ సంస్థల నుంచి ఇంకా అనుమతులు లభించాల్సి ఉంది. సన్‌ స్థాపించిన సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌లో టెక్‌ దిగ్గజాలు యాపిల్, ఫాక్స్‌కాన్, పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ ఆఫ్‌ ది కింగ్‌డమ్‌ ఆఫ్‌ సౌదీ అరేబియా మొదలైనవి భాగస్వాములుగా ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌కు పుష్కలంగా నిధులు..
సాఫ్ట్‌బ్యాంక్‌ పెట్టుబడుల రాకతో ఫ్లిప్‌కార్ట్‌ నగదు నిల్వలు ఏకంగా 4 బిలియన్‌ డాలర్లకు చేరనున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ దాదాపు 11.6 బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌తో... టెన్సెంట్, ఈబే, మైక్రోసాఫ్ట్‌ నుంచి 1.4 బిలియన్‌ డాలర్లు సమీకరించింది. ఇక తాజా పెట్టుబడులతో ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పటిదాకా 5 బిలియన్‌ డాలర్లకు పైగా నిధులు సమీకరించినట్లయింది. అమెరికా ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజం అమెజాన్‌కి గట్టి పోటీ ఇచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్‌ ఈ నిధులను వినియోగించనుంది. ఇటు విక్రేతలను, అటు కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఇరు సంస్థలు భారీ స్థాయిలో నిధులు కుమ్మరిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా అమెజాన్‌ భారత విభాగం కార్యకలాపాలపై దాదాపు 600 మిలియన్‌ డాలర్లు వ్యయం చేసింది.

అటు ఫ్లిప్‌కార్ట్‌ ఈ ఏడాది 4 బిలియన్‌ డాలర్ల దాకా సమీకరించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్వెస్ట్‌ చేసిన సాఫ్ట్‌బ్యాంక్‌కి.. దాని పోటీ సంస్థ స్నాప్‌డీల్‌లో కూడా పెట్టుబడులు ఉన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి నిధుల సంక్షోభం ఎదుర్కొంటున్న స్నాప్‌డీల్‌ను విలీనం చేయడం ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లోకి పెట్టుబడులతో వాటాలు దక్కించుకోవాలని సాఫ్ట్‌బ్యాంక్‌ యోచించింది. అయితే, స్నాప్‌డీల్‌ ఆశించిన రేటు రాకపోవడంతో డీల్‌ కుదరలేదు. దీంతో ఫ్లిప్‌కార్ట్‌లోకి సాఫ్ట్‌బ్యాంక్‌ నేరుగా ఇన్వెస్ట్‌ చేసింది. అటు ట్యాక్సీ సేవల సంస్థ ఓలాలో కూడా పెట్టుబడులు ఉన్న సాఫ్ట్‌బ్యాంక్‌.. భారత్‌లో దాదాపు 10 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు 2014లో వెల్లడించింది. ఈ ఏడాదే డిజిటల్‌ పేమెంట్స్‌ సంస్థ పేటీఎంలో 1.4 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 9,079 కోట్లు) పెట్టుబడులు పెట్టింది.

మరిన్ని వార్తలు