మధ్యతరగతి ప్రజలకు అతిపెద్ద ఊరట

9 Jan, 2018 18:45 IST|Sakshi

న్యూఢిల్లీ : మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం 2018-19 బడ్జెట్‌లో అతిపెద్ద ఊరట కల్పించబోతుంది. వ్యక్తిగత పన్ను మినహాయింపు పరిమితిని ఆర్థికమంత్రిత్వ శాఖ పెంచబోతున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం మాత్రమే కాక, పన్ను శ్లాబులను సర్దుబాటు చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం రూ.2,50,000గా ఉన్న పన్ను మినహాయింపు పరిమితిని కనీసం రూ.3,00,000కు పెంచాలనే ప్రతిపాదనలు ఆర్థికమంత్రిత్వ శాఖ ముందుకొచ్చినట్టు పేర్కొన్నాయి.  పన్ను మినహాయింపును పెంచడంతో పాటు, శ్లాబులను సర్దుబాటు చేయడం మధ్యతరగతి ప్రజలకు ముఖ్యంగా శాలరీ క్లాస్‌ వారికి ఎంతో మేలు చేకూరనుందని తెలుస్తోంది. 

గతేడాది బడ్జెట్‌లో పన్ను శ్లాబులను మార్చనప్పటికీ, చిన్న పన్ను చెల్లింపుదారులకు స్వల్ప ఊరటనిస్తూ.. వార్షిక ఆదాయం రూ.2,50,000 నుంచి రూ.5,00,000 వరకు ఉన్నవారికి పన్ను రేటును 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. ఈ ఏడాది బడ్జెట్‌ను ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతుంది. ఈ బడ్జెట్‌లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం ఉన్న వారికి పన్ను రేటును 10 శాతం విధించాలని ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది. అదేవిధంగా రూ.10-20 లక్షలున్న వారికి 20 శాతం, రూ.20 లక్షలు పైన ఆదాయమున్న వారికి 30 శాతం పన్ను రేటును విధించాలని చూస్తోంది. ద్రవ్యోల్బణం పెరగడంతో జీవన వ్యయాలు భారీగా పెరిగాయని, దీంతో మినహాయంపుల బేసిక్‌ పరిమితిని, పన్ను శ్లాబులను సర్దుబాటు చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

>
మరిన్ని వార్తలు