ఇక పన్ను రిఫండ్లు పది రోజుల్లోనే..!

14 Sep, 2015 01:37 IST|Sakshi
ఇక పన్ను రిఫండ్లు పది రోజుల్లోనే..!

- ఎలక్ట్రానిక్ ఆధారిత వెరిఫికేషన్‌తో సాకారం: ఐటీ శాఖ
న్యూఢిల్లీ:
పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. ఇకపై పన్ను రిఫండ్లు 7-10 రోజుల వ్యవధిలోనే ట్యాక్స్ పేయర్ల ఖాతాల్లోకి వచ్చే విధంగా ఆదాయపు పన్ను(శాఖ) ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యంగా ఐటీ రిటర్నులను వేగంగా పరిశీలించేందుకు వీలుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరిచామని... ఎలక్ట్రానిక్, ఆధార్ ఆధారిత వెరిఫికేషన్‌ను విజయవంతంగా మొదలుపెట్టినట్లు ఐటీ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. దీంతో ఈ అసెస్‌మెంట్ సంవత్సరం(2015-16)లో దాఖలైన ఐటీఆర్‌లకు సంబంధించి అర్హులైన పన్ను చెల్లింపుదారులకు గరిష్టంగా పది రోజుల్లో రిటర్న్‌లను తనిఖీ చేసి, రిఫండ్‌లను బ్యాంక్ ఖాతాల్లోకి జమచేసేందుకు వీలవుతుందని ఆయా వర్గాలు తెలిపాయి.

ఇప్పటివరకూ ఐటీ రిఫండ్లకు నెలల వ్యవధి.. కొన్ని కేసుల్లో అయితే సంవత్సరాలు కూడా పడుతుండటంతో సాంకేతికతను అప్‌గ్రేడ్ చేసినట్లు ఐటీ శాఖ అధికారి చెప్పారు. దేశంలో పన్ను సంబంధ యంత్రాంగంలో ఈ ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ ఈ-ఫైలింగ్ సిస్టమ్ కొత్త ఒరవడిని సృష్టిస్తుందన్నారుతాజా గణాంకాల ప్రకారం ఈ నెల 7 నాటికి(ఐటీఆర్ ఫైలింగ్‌కు ఆఖరి తేదీ) ఐటీ శాఖకు ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా 2.06 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు అంచనా. గతేడాది(1.63 కోట్లు)తో పోలిస్తే 26 శాతం వృద్ధి నమోదైంది. తమ సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్(సీపీసీ) ఈ నెల 7 వరకూ మొత్తం 45.18 లక్షల రిటర్నులను పరిశీలించి.. 22.14 లక్షల మంది అసెస్సీలకు ప్రస్తుత అసెంట్‌మెంట్ ఇయర్‌కు సంబంధించిన రిఫండ్‌లను చెల్లించినట్లు ఐటీ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వ్యవధిలో 32.95 లక్షల ఈ-రిటర్నులను ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ చేసినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు