ఇక విదేశీ స్మార్ట్‌ఫోన్లు కొనాలంటే..

12 Oct, 2018 09:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అంతకంతకూ దిగజారిపోతున్న కరెన్సీ రూపాయిని గట్టెక్కించేందుకు కరెంట్ అకౌంట్ లోటును నియంత్రించే చర్యల్లో భాగంగా కేంద్రం   నిర్ణయం తీసుకుంది. కొన్ని రకాల వస్తులపై  దిగుమతి సుంకాన్ని పెంచుతున్నట్టు ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ వెల్లడించింది. అక్టోబర్‌11, గురువారం అర్థరాత్రినుంచే పెరిగిన సుంకం అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. దీంతో దిగుమతి చేసుకున్న విదేశీ స్మార్ట్‌ఫోన్‌ ధరలు  మరింత భారం కావడం ఖాయం.  గత పదిహేనురోజుల్లోనే కొన్ని వస్తువులపై  దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేయడం ఇది రెండవ సారి.

ఆర్థికమంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 17రకాల వస్తులపై దిగుమతి పన్నును పెంచింది. వీటిల్లో స్మార్ట్‌వాచీలు,స్మార్ట్‌ఫోన్‌ ఎక్విప్‌మెంట్స్‌/ కంపోనెంట్స్‌ దిగుమతులపై 10శాతం సుంకాన్ని పెంచింది. ప్రింటర్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ (PCBA) వంటి కమ్యూనికేషన్ పరిశ్రమలో ఉపయోగించే కొన్ని ఇన్‌పుట్స్‌పై కూడా దిగుమతి సుంకం పెంచింది. దీంతో వీటిపై ప్రస్తుతం 10శాతంగా ఉన్న పన్ను 20 శాతానికి చేరింది. స్థానికంగా స్మార్ట్‌ఫోన్‌ తయారీలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఇంటర్మీడియట్ వస్తువులను నిషేధిస్తూ మరో నోటిఫికేషన్‌ను ఆర్థిక మంత్రిత్వ జారీచేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో  ఆరుసార్లు దిగుమతి సుంకాన్ని పెంచినట్టయింది. ఇటీవల 19 రకాల (ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఆభరణాలు, లెదర్‌ వస్తువులు, విమాన ఇంధనం తదితర)వస్తువులపై  సుంకాన్ని పెంచుతూ నిర్ణయాన్ని వెలువరించింది.

కాగా కరెంట్ అకౌంట్ లోటును తగ్గించే చర్యల్లో కొన్ని వస్తువులపై అధిక దిగుమతి సుంకాలను విధిస్తామని సెప్టెంబరులో ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ  పేర్కొన్నారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 2.4 శాతానికి చేరగా అక్టోబర్‌ నాటికి డాలరు మారకంలో భారత కరెన్సీ 7 శాతం క్షీణించి  రికార్డు కనిష్టానికి చేరిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు