ఫోర్బ్స్‌ ఇండియా అండర్‌ 30.. అర్జున్‌రెడ్డి.. మంధన

4 Feb, 2019 16:55 IST|Sakshi

2019 సంవత్సరానికి వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన 30 ఏళ్ల లోపు వారి జాబితాను ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. ‘ఫోర్బ్స్ ఇండియా థర్టీ అండర్ థర్టీ' పేరుతో ఆరవ జాబితాను సంస‍్థ విడుదల చేసింది. ఇందులో టాలీవుడ్  రైజింగ్‌ స్టార్‌​  విజయ్ దేవరకొండ స్థానం సంపాదించుకున్నాడని తెలిపింది. ముఖ్యంగా 2017లో అర్జున్‌రెడ్డి ద్వారా సంచలనం సృష్టించారని ఫోర్బ్స్‌ ఇండియా పేర్కొంది. 

వయస్సు 25 అయినా 52 ఏళ్లు అయినా సక్సెస్‌లను అభినందించడంతోపాటు, తక్కువ వయస్సులోనే విజయాలను అందుకున్నవారి ప్రతిభ, ధైర్యాన్ని గుర్తించడమే తమ లక్ష్యమని  ఫోర్బ్స్‌ ఇండియా వెల్లడించింది. విజయాలు, కెరీర్‌లో దూసుకెళ్లే తత్వం, తమ వ్యాపారాన్ని నిర్వహించే సత్తా, దీర్ఘకాలం ప్రతిభను కొనసాగించే సామర్థ్యం ఆధారంగా ఈ జాబితాను రూపొందించామనీ, దీనికి సంబంధించిన కథనాన్ని ఫిబ్రవరి 15, ఫోర్బ్స్‌ ఇండియా మ్యాగజీన్‌లో చూడొచ్చని తెలిపింది.

16 కేటగిరీల్లో 300 పేర్లను పరిశీలించిన అనంతరం ఈ జాబితాను రూపొంచింది. మీడియా, క్రీడలు, మార్కెటింగ్‌, పరిశ్రమ, ఎంటర్‌టైన్మెంట్, హాస్పిటాలిటీ, టెక్నాలజీ రంగాల్లోని  వారిని ఎంపిక చేసింది. మహిళా క్రికెట్‌ సంచలనం స్మృతి మంధాన, ప్రముఖ అథ్లెట్ హిమాదాస్‌ ఈ జాబితాలో చోటు దక్కించుకోగా, వీరితోపాటు యూట్యూబ్ పర్సనాలిటీ ప్రజక్త కోలీ, సింగర్ మేఘన మిశ్రా, ఆయుష్ అగర్వాల్ లాంటివారి పేర్లున్నాయి. ఇంకా పైనాన్స్‌ సంస్థను నడుపుతున్న ఐఐటీయన్లు వసంత్‌ కాంత్‌, అనురాగ్‌ శ్రీవాస్తవ, రోహన్‌గుప్త, ఇంకా నింజా కార్ట్‌ ద్వారా  రైతులకు నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం కల్పిస్తున్న కార్తీశ్వరన్‌, శరత్‌ లోగనాథన్‌, అశుతోష్‌ విక్రం తదితరులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.


 

మరిన్ని వార్తలు