‘ఆర్‌బీఐకి మరిన్ని అధికారాలు’

22 Dec, 2017 10:17 IST|Sakshi

వాషింగ్టన్‌: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) స్వతంత్రంగా వ్యవహరించేలా భారత్‌ పటిష్ట చర్యలు చేపట్టాలని ఐఎంఎఫ్‌ కోరింది. బ్యాంకుల పనితీరును చురుకుగా పర్యవేక్షించేందుకు, ప్రభుత్వం నియమించిన బ్యాంకు డైరెక్టర్ల తొలగింపు వంటి అంశాల్లో ఆర్‌బీఐకి పూర్తి అధికారాలుండాలని ఐఎంఎఫ్‌ నివేదిక స్పష్టం చేసింది.

రాజకీయ ప్రాబల్యం కలిగిన వ్యక్తుల నుంచి ఎదురయ్యే రిస్క్‌ల పరిష్కారం, కమాడిటీ మార్కెట్ల ఏకీకృత పర్యవేక్షణ అవసరమని అభిప్రాయపడింది. ఐఎంఎఫ్‌ తన ఫైనాన్షియల్‌ సిస్టమ్‌ స్టెబిలిటీ అసెస్‌మెంట్‌లో ఈ అంశాలు పొందుపరిచింది. ఆర్‌బీఐ స్వతంత్రంగా వ్యవహరించాలని పేర్కొనడంతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆర్‌బీఐకి విస్తృతాధికారాలు ఉండాలని పేర్కొంది.

ఆర్‌బీఐ నిర్ణయాలను ప్రభుత్వం అధిగమించడాన్ని చట్టంలో సవరణల ద్వారా అడ్డుకట్ట వేయాలని సూచించింది. ఇక కీలక వ్యవస్ధాగత సంస్కరణల ఊతంతో భారత్‌ ఆర్థిక, ఫైనాన్షియల్‌ ఆస్తుల పరంగా మంచి వృద్ధి కనబరుస్తోందని పేర్కొంది.

>
మరిన్ని వార్తలు