క్యాబ్‌ చార్జీ ఇక మీ చేతుల్లో...

26 Nov, 2019 05:17 IST|Sakshi
పవిత్‌ నందా

హైదరాబాద్‌లో ఇన్‌డ్రైవర్‌ సేవలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: క్యాబ్‌ చార్జీల విషయంలో ఇప్పటి వరకు అగ్రిగేటర్లదే తుది నిర్ణయం. రైడింగ్, పీక్‌టైం, సర్జ్‌ వంటి పేర్లతో కస్టమర్లపై అదనపు భారం మోపుతున్నాయి. ఇలాంటిది లేకుండా చార్జీని వినియోగదార్లే నిర్ణయించుకునేలా అమెరికాకు చెందిన ప్రముఖ క్యాబ్‌ అగ్రిగేటర్‌ ‘ఇన్‌డ్రైవర్‌’ తన సేవల్ని ప్రారంభించింది. ఈ సంస్థ డ్రైవర్‌ నుంచి ఎలాంటి కమిషన్‌ తీసుకోదు. కస్టమర్‌ నగదు రూపంలో చార్జీని డ్రైవర్‌కే చెల్లించాలి. ఇదెలా పని చేస్తుందంటే.. కస్టమర్‌ తాను ఎక్కవలసిన, దిగాల్సిన స్థలం నిర్దేశిస్తూ ఎంత చెల్లించేదీ యాప్‌లో సూచించాలి. సమీపంలో ఉన్న డ్రైవర్లకు ఈ సమాచారం వెళ్తుంది. కస్టమర్‌ చెల్లించదల్చుకున్న మొత్తం నచ్చకపోతే డ్రైవర్‌ బేరమాడవచ్చు. హైదరాబాద్‌లో 2,000 మంది డ్రైవర్లతో చేతులు కలిపామని ఇన్‌డ్రైవర్‌ ఇండియా పీఆర్‌ మేనేజర్‌ పవిత్‌ నందా సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. బేస్‌ ఫేర్‌ రూ.40గా నిర్ణయించామన్నారు. ఆరు నెలల తర్వాత డ్రైవర్ల నుంచి 5–10 శాతం కమీషన్‌ తీసుకుంటామని చెప్పారు.
 

మరిన్ని వార్తలు