హైదరాబాద్‌లో కపివ క్లినిక్స్‌

7 Nov, 2017 01:15 IST|Sakshi

కంపెనీ ఫౌండర్‌ శ్రే బధాని

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆయుర్వేద ఔషధాల తయారీ సంస్థ బైద్యనాథ్‌ గ్రూప్‌ కంపెనీ ‘కపివ’ త్వరలో హైదరాబాద్‌లో క్లినిక్స్‌ను ప్రారంభించనుంది. ప్రస్తుతం ముంబైలో నాలుగు కేంద్రాలను కపివ నిర్వహిస్తోంది. అలాగే బైద్యనాథ్‌ కో–బ్రాండెడ్‌లో కోల్‌కతాలో నాలుగు క్లినిక్స్‌ నడుస్తున్నాయి. 2018 డిసెంబరుకల్లా 20 సెంటర్లు అందుబాటులోకి వస్తాయని కపివ ఫౌండర్‌ శ్రే బధాని సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు.

వీటిలో మూడు కేంద్రాలు మార్చికల్లా హైదరాబాద్‌లో మొదలవుతాయన్నారు. నిపుణులైన వైద్యులతో పాటు ఫార్మసీ ఉంటుందని వివరించారు. ప్రముఖ వైద్యులతో చేతులు కలిపి కపివ కో–బ్రాండెడ్‌లో క్లినిక్స్‌ను ప్రమోట్‌ చేస్తామన్నారు ‘ప్రస్తుతం కపివ బ్రాండ్‌లో 180 ఔషధాలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో దేశవ్యాప్తంగా వీటిని విక్రయిస్తున్నాం. ఆఫ్‌లైన్‌లో ప్రస్తుతం ముంబై, కోల్‌కతాకు పరిమితమయ్యాం. ఆన్‌లైన్‌ అమ్మకాల్లో 45 శాతం హైదరాబాద్‌ నుంచి సమకూరుతోంది.

అందుకే భాగ్యనగరితోపాటు బెంగళూరులోని ఆయుర్వేద మందుల షాపుల్లో మా ఉత్పత్తులు పరిచయం చేయనున్నాం. విభిన్న ఫార్ములేషన్స్‌తో ఔషధాలను తయారు చేస్తున్నాం. ఒక్కో ఉత్పాదన తయారీకి పరిశోధనకు 18 నెలల దాకా సమయం పడుతోంది. 50 మంది నిపుణులైన వైద్యులు ఆర్‌అండ్‌డీలో నిమగ్నమయ్యారు’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు