కేరళ వరదలు: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు భారీ విరాళం

29 Aug, 2018 16:40 IST|Sakshi

10కోట్ల రూపాయల ఆర్థిక సహాయం

30 గ్రామాల దత్తత

గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు

రుణ వాయిదాలు, క్రెడిట్‌ కార్డు బిల్లులపై లేట్‌ ఫీజు మాఫీ

సాక్షి, ముంబై: ప్రయివేటురంగ దిగ్గజ  బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కేరళ వరద బాధితులకు భారీ సహాయాన్ని ప్రకటించింది.  పదికోట్ల రూపాయల విరాళాన్ని అందిస్తున్నట్టు వెల్లడించింది. అలాగే కేరళలో వరదలకు గురైన 30 గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్టు తెలిపింది.  దీంతోపాటు  ఆగస్టు మాసానికి సంబంధించి  పలు లోన్లపై  చెల్లించాల్సిన నెలవారీ వాయిదాలు,  క్రెడిట్ కార్డు బిల్లు  చెల్లింపులపై  లేటు ఫీజును కూడా మాఫీ చేస్తున్నట్టు తెలిపింది.  ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని డొనేట్‌  చేసినట్టు పేర్కొన్నారు. ఈ  ఆపద సమయంలో కేరళ ప్రజలకు అండగా నిలబడాలని తాము భావించామని బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య పూరి చెప్పారు.  త్వరలోనే కేరళ ప్రజలు కోలుకొని సాధారణమైన స్థితికి చేరుకోవాలని ప్రార్థించారు.

గ్రామాల దత్తతలో భాగంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని బ్యాంకు తెలిపింది. దీంతోపాటు ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల పునర్నిర్మాణ కార్యక్రమాలు   చేపడతామని తెలిపింది. అంతేకాదు  జీవనోపాధికి అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నామని  బ్యాంకు ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోపాటు  లాభాపేక్ష లేని స్థానిక  భాగస్వాముల సహాకారం ఈ కార్యక్రమాలను సుదీర్ఘ ప్రణాళికగా చేపడతామని వివరించింది.
 

మరిన్ని వార్తలు