దత్తత ఇచ్చిన బిడ్డకు డీఎన్‌ఏ పరీక్ష వద్దు

17 Nov, 2023 05:31 IST|Sakshi

పోలీసులకు బాంబే హైకోర్టు ఆదేశం  

ముంబై: అత్యాచారానికి గురైన బాధితురాలికి జన్మించిన బిడ్డను ఇతరులు దత్తత తీసుకున్న తర్వాత ఆ బిడ్డకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలనుకోవడం సమంజసం కాదని బాంబే హైకోర్టు తేలి్చచెప్పింది. బిడ్డ ప్రయోజనాలను కాపాడాలని, ఆమె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించవద్దని పోలీసులను ఆదేశించింది. బాంబే హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు ఈ నెల 10న తీర్పు వెలువరించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో 2020లో ఓ వ్యక్తి 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆమె గర్భం దాల్చింది. బిడ్డకు జన్మనిచి్చంది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అతడిని జైలుకు పంపించారు. మైనర్‌ బాలికకు జన్మించిన బిడ్డను గుర్తుతెలియని దంపతులు దత్తత తీసుకున్నారు. నిందితుడు 2 సంవత్సరాల 10 నెలలుగా జైల్లోనే ఉన్నాడు. తనకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం పోలీసులను ప్రశ్నించింది. బాధితురాలి బిడ్డకు డీఎన్‌ఏ పరీక్ష చేశారా? అని ఆరా తీసింది. బిడ్డను ఇతరులు దత్తత తీసుకున్నారని పోలీసులు బదులివ్వడంతో ఇక డీఎన్‌ఏ పరీక్ష అవసరం లేదని ఆదేశించింది. నిందితుడికి బెయిల్‌ మంజూరు చేసింది.

మరిన్ని వార్తలు