త్వరలో మహీంద్రా బీఎస్‌–6 వాహనాలు

4 Jun, 2019 05:19 IST|Sakshi

ద్వితీయ త్రైమాసికంలో గ్యాసోలిన్‌ వాహనం: పవన్‌ గోయెంకా

ముంబై: మోటార్‌ వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించే లక్ష్యంతో భారత ప్రభుత్వం భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌) నిబంధనలను ఎప్పటికప్పుడు మార్పులుచేస్తుండగా.. వీటికి అనుగుణంగా తమ వాహనాల ఉత్పత్తిలో మార్పులు చేస్తున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా తెలిపింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి ‘బీఎస్‌–సిక్స్‌’ నిబంధనలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో తాజా నిబంధనలకు తగిన వాహనాలను ఈ ఏడాది నుంచే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ అంశంపై మాట్లాడిన ఎంఅండ్‌ఎం మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ గోయెంకా.. ‘ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికం చివరినాటికి బీఎస్‌–6 గ్యాసోలిన్‌ వాహనాన్ని సిద్ధంచేస్తున్నాం. ఈ వాహనానికి.. నూతన నిబంధనలకు తగిన విధంగా ఇంధనం ఉండాలనే ఆంక్షలు లేనందున తొలుత దీనిని విడుదలచేస్తున్నాం. అయితే, డీజిల్‌ వాహనానికి మాత్రం దేశం మొత్తం ఒకే బీఎస్‌–6 ఇంధనం అందుబాటులో ఉండాలన్న నిబంధన ఉన్నందున ఈ వాహన విడుదల ఆలస్యం కానుంది. నూతన నిబంధనలకు సరిపడే విధంగా వాహనాలను ఉత్పత్తి చేయడం కోసం రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టాం. అమలుకు సంబంధించి ఎటువంటి టెక్నికల్‌ సమస్యలను ఎదుర్కొలేదు. ముందస్తు ప్రణాళికతో నూతనతరం వాహనాలను అందుబాటులోకి తీసుకునిరావడానికి రంగం సిద్ధంచేశాం’ అని అన్నారు.

మరిన్ని వార్తలు