నీరవ్‌ 173 పెయింటింగ్స్,  11 వాహనాలు వేలం!

21 Mar, 2019 00:45 IST|Sakshi

న్యూఢిల్లీ: కోట్లాది రూపాయల మేర పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)ను మోసం చేసి, దేశం నుంచి బ్రిటన్‌కు పారిపోయిన వజ్రాల వ్యాపారికి చెందిన 173 విలువైన పెయింటింగ్స్, 11 వాహనాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), ఆదాయపు పన్ను శాఖ(ఈడీ)లు వేలం వేయనున్నాయి. నీరవ్‌ మోదీ, ఆయన షెల్‌ కంపెనీ–క్యాపెలాట్‌ పెయింటింగ్స్‌కు బెనిఫీ షియల్‌ యజమానులు. ముంబైలోని ప్రత్యేక కోర్టు పెయింటింగ్స్, వాహనాల వేలానికి అనుమతి ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపారు. వేలం వేయనున్న పెయింటింగ్స్‌ విలువ రూ.57.72 కోట్లుకాగా, వేలం వేసే వాహనాల్లో రోల్స్‌ రాయీస్, పోర్చే, మెర్సిడెజ్, టొయోటా ఫారŠూచ్యన్‌ వంటి అత్యాధునిక మోడల్స్‌ ఉన్నట్లు సమాచారం. కోర్టు ఆదేశాల ప్రకారం... తనకురావల్సిన రూ.95.91 కోట్ల పన్ను బకాయిలకు సంబంధించి ఐటీ శాఖ 68 పెయింటింగ్స్‌ను వేలం వేస్తుండగా, మిగిలిన వాటిని (పీఎంఎల్‌ఏ కింద ఇప్పటికే  ఈడీ జప్పు పరిధిలో ఉన్నవి) ఈడీ వేలం వేస్తుందని ఉన్నత అధికారులు వెల్లడించారు. ఈ నెలాంతంలో వేలం జరిగే అవకాశం ఉంది. వచ్చిన మొత్తం ప్రభుత్వ ఖజానాకు జమవుతుంది. 

నీరవ్‌ భార్యకూ  నాన్‌–బెయిలబుల్‌ వారంట్‌
దాదాపు రూ.13,500 కోట్ల పీఎన్‌బీ కుంభకోణం కేసులో నీరవ్‌మోదీ భార్య ఆమీ ప్రమేయంపై ఇటీవల ఈడీ ఒక అనుబంధ చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన నేపథ్యంలో, ఆమెకు పీఎంఎల్‌ఏ (అక్రమ ధనార్జనా నిరోధక చట్టం) కోర్టు నాన్‌–బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేసినట్లు కూడా ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. 

>
మరిన్ని వార్తలు