సింగపూర్‌ ఫిన్‌టెక్‌ వేడుకలో మోదీ ప్రసంగం

13 Nov, 2018 00:49 IST|Sakshi

14, 15 తేదీల్లో సింగపూర్‌లో పర్యటన

బ్యాంకింగ్‌ సేవల అప్లికేషన్‌ ఆవిష్కరణ

సింగపూర్‌: సింగపూర్‌లో జరిగే ప్రపంచవ్యాప్త అతిపెద్ద ఫైనాన్షియల్‌ టెక్నాలజీ కంపెనీల సమ్మేళనంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అంతర్జాతీయ ఫిన్‌టెక్‌ కంపెనీలు, పరిశ్రమల ప్రతినిధులు, స్టార్టప్‌ కంపెనీలకు చెందిన సుమారు 30,000 మంది ఇందులో పాల్గొంటారు. 

మన దేశం నుంచి 400 మంది హాజరుకానున్నారు. అలాగే, 18 కంపెనీలు కూడా ఇందులో పాలుపంచుకుంటున్నాయి. ఈ సందర్భంగా బ్యాంకు ఖాతా లేకపోయినా సేవలు అందుకునేందుకు ఉద్దేశించిన అప్లికేషన్‌ ‘అపిక్స్‌’ను ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ నెల 14, 15వ తేదీల్లో ప్రధాని సింగపూర్‌ పర్యటనలో భాగంగా ప లు సదస్సులు, ఆసియాన్‌ భేటీలోనూ పాల్గొంటారు.

అపిక్స్‌ అప్లికేషన్‌
ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మందికి బ్యాంకింగ్‌ సేవలను చేరువ చేసేందుకు వర్చుసా కంపెనీ అపిక్స్‌ అప్లికేషన్‌ను రూపొందించింది. హైదరాబాద్, కొలంబో, లండన్‌కు చెందిన నిపుణులు దీన్ని డిజైన్‌ చేయడం గమనార్హం. సింగపూర్‌ మానిటరీ అథారిటీ, ఇంటర్నేషన్‌ ఫైనాన్స్‌కార్ప్, ఆసియాన్‌ బ్యాంకింగ్‌ అసోసియేషన్, వర్చుసా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నిఖిల్‌ మీనన్‌ ఆహ్వానం మేరకు ప్రధాని  టెక్నాలజీ సమ్మేళనంలో ఈ అప్లికేషన్‌ను ఆవిష్కరిస్తారు. భారత్‌ సహా 23 దేశాల ప్రజలకు ఈ అప్లికేషన్‌ అందుబాటులోకి వస్తుంది.   మోదీ ఈ పర్యటనలో భాగంగా తూర్పు ఆసియా సదస్సు, ఆసియాన్‌–భారత అనధికారిక సమావేశంలో పాల్గొంటారు.

మరిన్ని వార్తలు