ఇన్ఫీ ఢమాల్ ‌: భారీ నష్టాల్లో మార్కెట్లు

22 Oct, 2019 14:14 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఒడిదుడుకుల మధ్య ప్రారంభమైన  మార్కెట్లు వెనువెంటనే కోలుకుని 100 పాయింట్లకు పైగా ఎగిసాయి. తద్వారా వరుసగా ఏడో రోజు లాభాలు నమోదు చేశాయి. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ ప్రస్తుతం సెన్సెక్స్‌ 250  పాయింట్లు నష్టపోయి 39,044 వద్ద, నిఫ్టీ సైతం 58 పాయింట్లు పతనమై 11,608 వద్ద ట్రేడవుతోంది. 

సాప్ట్‌వేర్‌ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ కీలక అధికారులపై ఉద్యోగులు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. స్వల్ప కాలంలో మార్జిన్‌లు, లాభాలను పెంచుకోడానికి అనైతిక విధానాలను అనుసరిస్తోందని ఇన్ఫోసిస్‌కు వ్యతిరేకంగా, కొంతమంది ఉద్యోగులు యుఎస్‌ సెక్యురిటీ  ఎక్స్జేంజ్‌కు, ఇన్ఫోసిస్‌ బోర్డుకు లేఖలు రాయడంతో సోమవారం సెషన్‌లో ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌లు (యుఎస్‌ మార్కెట్లో) 16 శాతం మేర పడిపోయాయి.  దేశీయంగా (మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా సోమవారం దేశీయ స్టాక్‌మార్కెట్లకు సెలవు) మంగళవారం 10 శాతానికి పైగా కుప్పకూలిన ఇన్ఫీ షేరు 10 ఏళ్ళ కనిష్టానికి చేరింది. గత ఆరేళ్ల కాలంలో ఇదే అతిపెద్ద నష్టమని విశ్లేషకులు చెబుతున్నారు. బ్యాంకింగ్‌, ఆటో తప్ప, అన్ని ముఖ్యంగా ఐటీ నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌ 8.6 శాతం జంప్‌ చేయగా ఐసీఐసీఐ,  హీరోమోటో, బజాజ్‌ ఆటో, ఐటీసీ, అల్ట్రాటెక్‌, గ్రాసిమ్‌, హెచ్‌యూఎల్‌, టైటన్‌, పవర్‌గ్రిడ్‌, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బీపీసీఎల్‌  లాభపడుతున్నాయి. అటు టాటా మోటార్స్‌ 2 శాతం నీరసించగా.. టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, ఇన్‌ఫ్రాటెల్‌ క్షీణించాయి.

మరిన్ని వార్తలు