ఆర్డినెన్స్లపై ఆశాభావం
154 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ముంబై: కేంద్రం ఆర్థిక సంస్కరణల కోసం పలు ఆర్డినెన్స్లను తీసుకురానున్నదన్న వార్తలతో సోమవారం స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. క్రిస్మస్ సెలవుల సందర్భంగా లావాదేవీలు మందకొడిగా ఉన్నప్పటికీ, లోహ, వాహన రంగ షేర్లలో కొనుగోళ్ల కారణంగా బీఎస్ఈ సెన్సెక్స్ 154 పాయింట్లు పెరిగింది.
అంతర్జాతీయ సంకేతాలు పటిష్టంగా ఉండడం, విదేశీ ఫండ్ల కొనుగోళ్లు షురూ చేయడంతో వరుసగా రెండో సెషన్లోనూ సెన్సెక్స్ లాభాల బాటలోనే నడిచింది. గరిష్టంగా 27, 507 పాయింట్లకు ఎగసిన సెన్సెక్స్ చివరకు 154 పాయింట్ల లాభంతో 27,395.73 వద్ద ముగిసింది. మరో వైపు నిఫ్టీ 46 పాయింట్ల లాభంతో 8,246 వద్ద ముగిసింది.
బ్యాంకింగ్ సూచి మినహా మిగిలిన 11 రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ఈ నెల 9 నుంచి 12 రోజుల పాటు భారీగా అమ్మకాలు జరిపిన ఎఫ్పీఐ(ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్)లు గత శుక్రవారం రూ.39.9 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారని స్టాక్మార్కెట్ డేటా వెల్లడిస్తోంది.
మధ్యాహ్నం తర్వాత లాభాల స్వీకరణ
భూ సేకరణ, మైనింగ్ ఇతర చట్టాల్లో ఆర్డినెన్స్ల రూపంలో కేంద్రం మార్పులు, చేర్పులు చేయనున్నదన్న వార్తలతో పలు మౌలిక రంగ, లోహ షేర్లు పెరిగాయి. హిందాల్కో, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టీల్ తదితర లోహ షేర్లు సెన్సెక్స్కు తగిన తోడ్పాటునందించాయి. డిసెంబర్ అమ్మకాల గణాంకాలు మరో రెండు రోజుల్లో వెల్లడి కానున్నందున వాహన షేర్లలో కొనుగోళ్ల జోరు పెరిగింది.
డాలర్తో రూపాయి మారకం విలువ క్షీణించడంతో ఫార్మా, ఐటీ షేర్లు పెరిగాయి. మధ్యాహ్నం తర్వాత లాభాల స్వీకరణ కారణంగా ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి. మార్కెట్ బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది. శుక్రవారం రూ.1,962 కోట్లుగా ఉన్న మొత్తం మార్కెట్ టర్నోవర్ సోమవారం రూ.2,261 కోట్లకు పెరిగింది.
టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ, ఆర్ఐఎల్, ఐటీసీ, టీసీఎస్, సెసా స్టెరిలైట్, సన్ ఫార్మా, హీరో మోటొకార్ప్, హిందాల్కో, హిందూస్తాన్ యూనిలివర్, కోల్ ఇండియా, టాటా స్టీల్ షేర్లు 4 శాతం నుంచి 1 శాతం రేంజ్లో పెరిగాయి. ఆసియా, యూరోప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. చైనా, హాంగ్కాంగ్, సింగపూర్, తైవాన్ సూచీలు 0.74 శాతం నుంచి 1.82 శాతం మధ్యలో పెరగ్గా, జపాన్, దక్షిన కొరియాలు సూచీలు 0.5 శాతం, 1.04 శాతం చొప్పున క్షీణించాయి.