ముంబై : స్టాక్ మార్కెట్ల బోణి అదిరింది. సెన్సెక్స్ ఏకంగా ప్రారంభంలోనే డబుల్ సెంచరీ సాధించింది. నిఫ్టీ సైతం 11,300 మార్కును పునరుద్ధరించేసుకుంది. ప్రపంచ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలు, రూపాయి విలువ బలపడటంతో దలాల్ స్ట్రీట్ దుమ్మురేపింది. ప్రస్తుతం సెన్సెక్స్ 200 పాయింట్ల లాభంలో 37,321 వద్ద, నిఫ్టీ 71 పాయింట్ల లాభంలో 11,305 వద్ద ట్రేడవుతున్నాయి. ఐటీ స్టాక్స్ మినహా మిగతా అన్ని రంగాల షేర్లు లాభాల పంట పండిస్తున్నాయి.
బ్యాంక్లు, ఆటో, మెటల్స్, ఫార్మా, ఎనర్జీ స్టాక్స్ ఎక్కువగా లాభాలను ఆర్జిస్తున్నాయి. మొత్తంగా నిఫ్టీ మిడ్క్యాప్ ఇండెక్స్ కూడా ఒక శాతం మేర పెరిగింది. అయితే యస్ బ్యాంక్ షేరు మాత్రం ప్రారంభంలోనే 30 శాతం మేర నష్టపోయింది. ఆ బ్యాంక్ ఎండీ, సీఈవో రాణా కపూర్ పదవి కాలాన్ని తగ్గించడంతో, యస్ బ్యాంక్ నష్టాలు పాలవుతోంది. జెట్ ఎయిర్వేస్ కూడా 6 శాతం తగ్గింది. జెట్ ఎయిర్వేస్ పరిసర ప్రాంతాల్లో ఐటీ సర్వేలు ఆ సంస్థ స్టాక్ను దెబ్బతీస్తున్నాయి. అటు ఇన్ని రోజులు క్షీణిస్తూ వచ్చిన డాలర్ మారకంలో రూపాయి విలువ శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో బలపడింది. 52 పైసలు పెరిగి 71.85 వద్ద ట్రేడవుతోంది.