సాక్షి, ముంబై : అంతర్జాతీయ, ముఖ్యంగా ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. కరోనా వైరస్ భయాలు గ్లోబల్ మార్కెట్లను ఇంకా వణికిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం మరింత దిగజారి సెన్సెక్స్ 125 పాయింట్లు పతనమై 39633 వద్ద, 40 వేల దిగువకు చేరింది.అలాగే నిఫ్టీ 20 పాయింట్లు నష్టపోయి 11642 వద్ద కొనసాగుతున్నాయి. అయితే శనివారం దాదాపు 1000 పాయింట్లు పైగా కుప్పకూలిన నేపథ్యంలో షార్ట్ కవరింగ్ కారణంగా సూచీలు తిరిగి పుంజుకుని లాభాల్లోకి మళ్లే అవకాశం ఉందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
ఆటో, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ కంపెనీల షేర్లు నష్టపోతున్నాయి. గత ఏడాది సెప్టెంబరు మందగమనం నుంచి ఆటో మొబైల్ కంపెనీలు 3వ త్రైమాసికంలో క్రమంగా కోలుకుంటున్న ధోరణి కనిపించింది. శనివారం నాటి ఫలితాల నేపథ్యంలో మారుతి, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్ బలహీనంగా ఉన్నాయి. ఏజీఆర్పై నేడు విచారణ నేపథ్యంలో భారతి ఎయిర్టెల్ నష్టపోతోంది. సిగరెట్ల ధరలు పుంజుకుంటాయన్న వార్తలతో ఐటీసీ భారీగా నష్టపోతోంది. అటు డాలరుతో పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి నష్టంతో 71.63 వద్ద ట్రేడింగ్ను ఆరంభించింది. ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. 2019 మే తరువాత ఇదే బలహీనం.