విప్రో లాభం రూ.2,456 కోట్లు

15 Jan, 2020 03:04 IST|Sakshi

2 శాతం క్షీణత  

3 శాతం పెరిగిన ఆదాయం  

ఒక్కో షేర్‌కు రూ. 1 డివిడెండ్‌  

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో ఈ ఆర్థిక సంవత్సరం(2019–20) డిసెంబర్‌ క్వార్టర్‌లో రూ.2,456 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం(రూ.2,510 కోట్లు)తో పోల్చితే 2 శాతం క్షీణించిందని  విప్రో సీఈఓ, ఎమ్‌డీ అబిదాలి జడ్‌ నీముచ్‌వాలా తెలిపారు. ఆదాయం మాత్రం రూ.15,060 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.15,470 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.1 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. ఆర్థిక ఫలితాలకు సంబంధించి కంపెనీ వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు..... 

మార్చి క్వార్టర్‌లో ఐటీ సేవల విభాగం ఆదాయం 2 శాతం (సీక్వెన్షియల్‌గా)మేర పెరగగలదని ఈ కంపెనీ అంచనా వేస్తోంది. డిసెంబర్‌ క్వార్టర్‌లో 209 కోట్ల డాలర్ల మేర ఉన్న ఐటీసేవల విభాగం ఆదాయం ఈ మార్చి క్వార్టర్‌లో 210–214 కోట్ల డాలర్ల రేంజ్‌లో ఉండొచ్చని పేర్కొంది. ఈ క్యూ3లో షేర్‌ వారీ ఆర్జన(ఈపీఎస్‌) 3 శాతం వృద్ధితో రూ.4.30కు పెరిగింది. పది కోట్ల డాలర్ల డీల్స్‌ను నాలుగింటిని సాధించింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ విభాగం(బీఎఫ్‌ఎస్‌ఐ) పనితీరు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, ఈ క్యూ4లో మంచి డీల్స్‌నే సాధించగలమని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది. డిజిటల్‌ విభాగం మంచి వృద్ధిని సాధిస్తోంది. గత క్యూ3లో మొత్తం ఆదాయంలో 23 శాతం వాటా ఉన్న ఈ విభాగం వాటా ఈ క్యూ3లో 40 శాతానికి ఎగసింది.  

1,891 మందికి కొత్త ఉద్యోగాలు.... 
ఈ క్యూ3లో 1,891 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చింది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.87,318కు పెరిగింది. ఆట్రిషన్‌ రేటు (ఉద్యోగుల వలస) 15.7 శాతానికి తగ్గింది. అమెరికాలోని మొత్తం ఉద్యోగుల్లో స్థానికుల వాటా 70 శాతానికి పెరిగింది. మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్‌ఈలో విప్రో షేర్‌ స్వల్పంగా లాభపడి రూ.257 వద్ద ముగిసింది.  నికర లాభం 2 శాతం తగ్గడంతో అమెరికా స్టాక్‌ ఎక్సే్చంజ్‌లో లిస్టయిన విప్రో ఏడీఆర్‌ 3.5 శాతం నష్టంతో 3.78 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.    

మంచి వృద్ధి సాధించాం...
ఈ క్యూ3లో మంచి వృద్ధి సాధించాం. అన్ని విభాగాలు, అన్ని మార్కెట్లలో కూడా మంచి పనితీరునే చూపించాం. క్లయింట్లతో సత్సంబంధాలపై దృష్టి పెడుతున్నాం. భారీ డీల్స్‌ సాధించడంపైననే ప్రధానంగా దృష్టి పెట్టాం.  
–అబిదాలి జడ్‌ నీముచ్‌వాలా,సీఈఓ, విప్రో కంపెనీ 

>
మరిన్ని వార్తలు