షార్ట్ కవరింగ్‌తో లాభాలు

30 Jul, 2015 01:47 IST|Sakshi

104 పాయింట్ల లాభంతో 27,563కు సెన్సెక్స్
 
 నాలుగు వరుస ట్రేడింగ్ సెషన్ల నష్టాలకు స్టాక్ మార్కెట్ బుధవారం బ్రేక్ వేసింది. ఇటీవల కాలంలో బాగా పతనమైన షేర్లలో షార్ట్ కవరింగ్ జరగడంతో మార్కెట్లు కాస్త లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 104 పాయింట్ల లాభంతో 27,563 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 38 పాయింట్లు లాభపడి 8,375 పాయింట్ల వద్ద ముగిశాయి.  భారత్‌లో పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీసే చర్యలేవీ తీసుకోబోమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభయమివ్వడం, చైనా సూచీ షాంఘై రికవరీ కావడం సెంటిమెంట్‌కు బలమిచ్చింది.

ఐటీ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగినా... వడ్డీరేట్ల పెంపుకు సంబంధించి ఫెడరల్ రిజర్వ్ సమావేశ ఫలితం బుధవారం అర్థరాత్రి వెలువడే అవకాశాలుండడం, జులై  డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరించారు. 30 సెన్సెక్స్ షేర్లలో 20 షేర్లు లాభాల్లో ముగిశాయి. 1,655 షేర్లు లాభాల్లో, 1,170 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.3,348 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.17,194 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ,3,56,085 కోట్లుగా నమోదైంది.

 బ్యాంక్ షేర్లు బేర్
 కాగా మొండి బకాయిలు అంతకంతకూ పెరిగిపోతుండటంతో బ్యాంక్ షేర్లు బేర్‌మంటున్నాయి. ఇప్పటివరకూ దాదాపు పదికి పైగా ప్రభుత్వ రంగ బ్యాంకులు క్యూ1 ఆర్థిక ఫలితాలను వెల్లడించాయి. పలు బ్యాంకుల షేరు ధరలు ఏడాది కనిష్ట స్థాయిని తాకాయి.

మరిన్ని వార్తలు