భారత్‌, ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో మ్యారేజ్‌ ప్రపోజల్‌

15 Jul, 2018 09:08 IST|Sakshi

లండన్‌ : లార్డ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌, భారత్‌ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మ్యాచ్‌ వీక్షించడానికి వచ్చిన ఓ వ్యక్తి  మోకాళ్లపై కూర్చొని తన గర్ల్‌ఫ్రెండ్‌కు మ్యారేజ్‌ ప్రపోజల్‌ చేశాడు. ఈ చర్యతో కాసింత సిగ్గుపడిన ఆ యువతి తర్వాత అతని ప్రపోజల్‌ను అంగీకరించింది. అతడు ఇచ్చిన రింగ్‌ను స్వీకరించింది. దీంతో స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ దృశ్యాలు టీవీలో కూడా ప్రసారం అయ్యాయి. కామెంటేటర్స్‌ కూడా దీనిపై తమదైన శైలిలో స్పందించారు. ఆ సమయంలో బౌలింగ్‌ చేస్తున్న భారత బౌలర్‌ చాహల్‌ కూడా క్లాప్స్‌ కొడుతు వారికి శుభాకాంక్షలు తెలిపాడు.

అయితే ఆ వ్యక్తి ప్రపోజ్‌ చేసిన సమయంలో ‘డెసిషన్‌ పెండింగ్‌’  అంటూ.. ఆమె అతని ప్రపోజల్‌ అంగీకరించిన తర్వాత ‘షీ సెడ్‌ యస్‌’  అంటూ టీవీ స్ర్కీన్‌పై  ప్లాష్‌ నిచ్చారు. కొద్ది క్షణాల్లోనే ఈ వీడియో, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు ఈ ప్రపోజల్‌ను అభినందిస్తూ, వారికి శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. ఆ తర్వాత వారిద్దరిని కామెంటేటర్స్‌ బాక్స్‌లోకి పిలిచిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డ్‌ అధికారులు వారికి చిన్నపాటి బహుమతి కూడా అందజేసినట్టు సమాచారం. గతంలో కూడా క్రికెట్‌ మ్యాచ్‌లు జరగుతున్న సందర్భాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 86 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది.

మరిన్ని వార్తలు