శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఓ వాహనంపై భారీ మంచు చరియలు విరిగిపడ్డ ఘటనలో 11 మృతదేహాలను వెలికితీసినట్లు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఖలీద్ జహంగీర్ శనివారం తెలిపారు. ఖూనీ నల్లా ప్రాంతంలో కుప్వారా–తంగ్ధర్ రోడ్డుపై శుక్రవారం భారీ మంచు చరియలు విరిగిపడ్డ సంగతి తెలిసిందే. ఘటనాస్థలి నుంచి ప్రాణాలతో ఉన్న ముగ్గురు ప్రయాణికుల్ని ఇప్పటివరకు కాపాడినట్లు వెల్లడించారు. మరోవైపు ఈ ప్రమాదంలో మృతులకు జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.12,600 నష్టపరిహారం అందజేస్తామని రాష్ట్ర విపత్తు నిర్వహణ, పునరావాస శాఖ మంత్రి జావీద్ ముస్తాఫా మీర్ ప్రకటించారు.