‘ఖని’లో బాలిక ఆత్మహత్య

4 Feb, 2019 08:43 IST|Sakshi
వైష్ణవి మృతదేహం  

స్కూల్‌కు వెళ్లాలని మందలించిన తల్లిదండ్రులు 

మనస్తాపంతో ఉరేసుకున్న వైనం 

కోల్‌సిటీ(రామగుండం): స్కూల్‌కు వెళ్లాలని తల్లిదండ్రులు మందలించినందుకు గోదావరిఖనిలో పొరండ్ల వైష్ణవి(14) ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వన్‌టౌన్‌ ఎస్సై ఎ.వెంకటేశ్వర్లు వివరాల మేరకు... స్థానిక ఫైవింక్లయిన్‌ ఏరియాకు చెందిన పొరండ్ల ఆనంద్, సరిత దంపతులకు కొడుకు రాహుల్, కూతురు వైష్ణవి ఉన్నారు. దంపతులిద్దరూ స్థానిక విఠల్‌నగర్‌ పార్క్‌ సమీపంలో కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. స్థానికంగానే ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న వైష్ణవి 15 రోజులుగా స్కూల్‌కు వెళ్లడంలేదు. ఈ విషయంపై వైష్ణవిని తల్లిదండ్రులు మందలించారు.

ఆదివారం ఉదయం తల్లి, తండ్రితోపాటు సోదరుడు కూరగాయాల దుకాణంలో ఉండగా, వైష్ణవి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ క్రమంలో మనస్తాపంకు గురై ఇంటి పైకప్పు ఇనుప ఊచకు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోంచి కూరగాయల దుకాణంకు వెళ్లిన తండ్రి, గంట తర్వాత ఇంట్లో దాచిన డబ్బుల కోసం ఇంటికి వచ్చాడు. మధ్యరూంలో వైష్ణవి ఉరికి వేల్లాడుతూ కనిపించడంతో, హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లి గుండెలవిసేలా రోదించింది. ఆనంద్‌ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మరిన్ని వార్తలు