ఏసీబీ వలలో మేడ్చల్ సబ్‌రిజిస్టార్

13 Jun, 2018 14:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంతో మేడ్చల్ సబ్‌రిజిస్టార్ కిషన్‌ప్రసాద్ ఇంటిపై ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. మేడ్చల్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు కిషన్‌ప్రసాద్‌కు చెందిన నాలుగు ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ డీఎస్‌పి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా అల్మాస్‌గూడలో కిషన్ ప్రసాద్ చెందని రెండు ఇళ్లలో ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్న అధికారులు పలు విలువైన భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇప్పటి వరకు సుమారు రెండు కోట్ల మేర ఆదాయానికి మించి ఆస్తులు కనుగొన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అల్మాస్‌గూడ ప్రాంతంలో రెండు ఇళ్లు, రెండు ఎకరాల నాలుగున్నర గుంటల వ్యవసాయ భూమి, హస్తినాపురంలో ఇంటి స్థలంతో పాటు పది తులాల బంగారం, బ్యాంకు పాస్‌పుస్తకాలు గుర్తించారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. 

మరిన్ని వార్తలు