సాక్షి, బెంగళూరు: ఆస్తి వివాదంలో విచక్షణ కోల్పోయిన ఒక కొడుకు కన్నతల్లినే హత్య చేశాడు. ఈ సంఘటన బెంగళూరు పరిధిలో దేవనహళ్లిలో సోమవారం రాత్రి జరిగింది. జయశ్రీ (42) అనే మహిళ గత 20 ఏళ్లుగా భర్తనుంచి దూరంగా ఉంటోంది. తనకు దేవుడు పూనుతాడని, అందువల్ల సంసారం చేయలేనని ఒంటరిగా యలహంకలో నివసిస్తోంది. సోమవారం సాయంత్రం కలలో దేవుడు కనిపించాడని దేవనహళ్లిలో భర్తకు చెందిన స్థలంలో పూజలు చేయసాగింది. ఇది తెలిసి ఆమె కొడుకు అరుణ్ (22) వచ్చి ఆమెతో ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని గొడవకు దిగాడు. ఆమె వినిపించుకోకపోవడంతో తాను నడిపే లారీతో ఆమె మీద నుంచి పోనిచ్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించగా, పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.