బాలుడి వీరంగం

15 Sep, 2018 08:03 IST|Sakshi

ట్రాఫిక్‌ పోలీసులపై దాడి

అత్తపూర్‌: ట్రాఫిక్‌ పోలీసులపై ఓ బాలుడు దాడిచేసిన సంఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ప్రత్యక్షసాక్షులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ పీఎస్‌కు చెందిన పోలీసు అధికారి కేశవులు సిబ్బందితో కలిసి హైదర్‌గూడ పల్లవిబార్‌ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. ఉదయం 10.30 సమయంలో హైదర్‌గూడ నుంచి అత్తాపూర్‌ వైపు బైక్‌పై వేగంగా వెళుతున్న బాలుడి (17)ని గుర్తించిన పోలీసులు అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా బైక్‌ ఆపలేదు.

దీంతో పోలీసులు అతడిని ఫొటో తీసేందుకు ప్రయత్నించగా బైక్‌ దిగిన బాలుడు ‘నన్నే ఫొటో తీస్తావా’ అంటు ట్రాఫిక్‌ పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. స్తానికులు అతడిని వారించేందుకు యత్నించినా వినకుండా పోలీసులను కాలితో తంతూ దుర్బాషలాడాడు. దీంతో పోలీసులు అతడిని పట్టుకొని వ్యాన్‌లోకి ఎక్కించినా శాంతించకుండా వారిపై దాడి చేశాడు. దీనిపై సమాచారం అందడంతో రాజేంద్రనగర్‌ ఎస్సై వెంకటేష్‌ సిబ్బందితో అక్కడికి చేరుకుని బాలుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు