యువకుడి దారుణ హత్య

1 Oct, 2019 08:55 IST|Sakshi
శ్యామ్‌ (ఫైల్‌), నిందితుడు పొన్‌రాజ్‌  

సాక్షి, చెన్నై : మద్యం మత్తులో ఉన్న వ్యక్తి సిగరెట్‌ తీసివ్వడానికి నిరాకరించిన యువకుడిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన తిరువళ్లూరు పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి కలకలం రేపింది. వివరాలు.. తిరువళ్లూరు పట్టణంలోని మేట్టుకాలనీకి చెందిన శ్యామ్‌ అలియాస్‌ శ్యామ్‌వేల్‌(20) ఆదివారం అర్ధరాత్రి తన స్నేహితులతో కలిసి అదే ప్రాంతంలోని లాల్‌బహుదూర్‌ శాస్త్రీ వీధిలో వెళుతున్నాడు. అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న పొన్‌రాజ్‌ శ్యామ్, అతని స్నేహితులను పిలిచి తనకు సిగరెట్‌ కావాలని కోరాడు. అయితే ఇందుకు నిరాకరించిన శ్యామ్‌ స్నేహితులతో కలిసి ఇంటికి బయలుదేరాడు. ఈ సమయంలో పొన్‌రాజ్‌కు శ్యామ్‌కు మధ్య ఘర్షణ జరిగింది.

దీంతో ఆగ్రహించిన పొన్‌రాజ్‌.. సిగరెట్‌ ఇవ్వని నీకు బతికే అర్హత లేదంటూ కత్తితో శ్యామ్‌ను దారుణంగా పొడిచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన శ్యామ్‌ను స్థానికులు, స్నేహితులు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. 

వెంటనే అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టారు. మృతి చెందిన విషయం తెలియడంతో ఆగ్రహించిన మృతుడి బంధువులు నిందితుడి కారును దగ్ధం చేసి నానా రసాభా సృష్టించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. తిరువళ్లూరు టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు