సహచరులను చంపి.. జవాన్‌ ఆత్మహత్య

6 May, 2018 18:33 IST|Sakshi

అగర్తాల: త్రిపురలో ఓ బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ దారుణానికి పాల్పడ్డారు. అక్కడే పనిచేస్తున్న ముగ్గురు సహోద్యోగులపై తన సర్వీస్‌ తుపాకీతో కాల్పులు జరిపి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన త్రిపురలోని ఉనాకోటి జిల్లా పరిధిలోని మగురూలి సరిహద్దుల్లో జరిగింది. శిశుపాల్‌ అనే జవాన్‌..తన సహోద్యోగి  అయిన హెడ్‌కానిస్టేబుల్‌ బిజోయ్‌ కుమార్‌పై విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు.

దీంతో బిజోయ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అక్కడే ఉన్న మరో ఇద్దరు జవాన్లు రింకూ కుమార్‌, రాకేశ్‌ కుమార్‌ జాదవ్‌లపై కాల్పులు జరిపి, అదే తుపాకీతో తనని తాను కాల్చుకొని చనిపోయాడు. తీవ్ర గాయాలపాలైన ఇద్దరి జవాన్లను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. దీనిపై స్థానిక ఎస్పీ శంకర్‌ దేవ్‌నాథ్‌ మాట్లాడుతూ.. ‘బీఎస్‌ఎఫ్‌ జవాను.. హెడ్‌ కానిస్టేబుల్‌తో సహా మరో ముగ్గురిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఆదివారం అర్థరాత్రి ఒంటిగంట ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో హెడ్‌ కానిస్టేబుల్‌ అక్కడికక్కేడ మృతి చెందారు. మిగతావారిని ఉనాకోటిలోని ఆసుపత్రికి తరలించగా అందులో చికిత్స పొందుతూమరణించారు. మృతదేహాలను స్వరాష్ట్రలకు తరలించే ప్రయత్నం చేస్తున్నాం. ఘటనపై విచారణ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది’ అని తెలిపారు.

>
మరిన్ని వార్తలు