కార్పెంటర్‌ ఆత్మహత్య

27 Apr, 2018 13:33 IST|Sakshi
ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న భాస్కరరావు

దేవరాపల్లి(మాడుగుల): స్థానిక ఎరుకుల కాలనీలో ఓ కార్పెంటర్‌ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. స్థానిక ఎస్‌ఐ పి.నర్సింహమూర్తి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.  ఎరుకుల కాలనీలో నివాసముంటున్న కార్పెంటర్‌ గానుగుల భాస్కరరావు(45)కు  భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె రమాదేవి అలియాస్‌ అన్నపూర్ణకు కె.కోటపాడు మండలం కె.సంతపాలెం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం చేశారు.  రెండో కుమార్తె శ్రావణి బీఫార్మసీ చదువుతోంది.  భాస్కరరావు కార్పెంటర్‌ వృత్తి చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.  నాలుగేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో అతని కుడి భుజం బాగా దెబ్బతింది. అప్పటి నుంచి బాధను తట్టుకోలేక మద్యానికి బానిస అయ్యాడు.

దీంతో  భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. పలు మార్లు పంచాయతీ పెట్టినా అతడి పరిస్థితిలో మార్పు రాలేదు.  పెళ్లి ఈడుకు వచ్చిన కుమార్తె ఇంటిలో ఉండగా  మద్యం సేవిస్తే ఎలా అంటూ భార్య ప్రశ్నించడంతో మళ్లీ వారిద్దరి మధ్య గొడవ జరిగింది.  భర్తలో మార్పు తెచ్చేందుకు  లక్ష్మి ఇటీవల స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో భాస్కరరావు, లక్ష్మిని దేవరాపల్లి ఎస్‌ఐ మూర్తి  బుధవారం స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇకపై  మద్యం సేవించడం మానేయాలని చెప్పి, ఇంటికి పంపించారు.  తన పెద్ద కుమార్తె కుమారుడి నామకరణ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మి,  అనంతరం కుమార్తె అత్తవారి గ్రామమైన కె.సంతపాలెంకు వారితో కలిసి వెళ్లింది.   ఇంటిలో ఒంటిరిగా ఉన్న భాస్కరరావు  హుక్‌కు   ఉరివేసుకుని ఆత్మహత్యకు         పాల్పడ్డాడు.   లక్ష్మి గురువారం ఉదయం  ఇంటికి వచ్చి చూడగా భర్త ఉరివేసుకుని ఉండడాన్ని గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చోడవరం తరలించారు.

మరిన్ని వార్తలు