ఆర్మీ ‘పండిట్‌’ నియామకాల్లో అక్రమాలు 

27 Apr, 2018 02:56 IST|Sakshi

అధికారులు, బినామీలపై కేసు నమోదు చేసిన సీబీఐ 

2013లో హైదరాబాద్‌ కేంద్రంగా సాగిన కుంభకోణం 

డబ్బులు తీసుకుని సులభ ప్రశ్నలు అడిగిన ఆర్మీ అధికారులు 

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్మీలో రిలీజియస్‌ టీచర్స్‌ (పండిట్‌) ఉద్యోగాల నియామక ప్రక్రియలో కుంభకోణం జరిగిందని సీబీఐ కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌లోని ఆర్టిలరీ సెంటర్‌లో జరిగిన ఇంటర్వ్యూకు దేశంలోని అనేక రాష్ట్రాల అభ్యర్థులు హాజరయ్యారు. 2013 నుంచి 2014 మధ్య హైదరాబాద్‌లో జరిగిన ఈ ఇంటర్వ్యూ ప్రక్రియలో కుంభకోణం జరిగిందని సీబీఐ పేర్కొంది. కొందరు ఆర్మీ సుబేదార్‌ అధికారులు అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలొచ్చాయి. ఆర్మీ సుబేదార్‌ ఎమ్‌ఎన్‌ త్రిపాఠి కుంభకోణం మొత్తానికి సూత్రధారిగా పేర్కొంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. 

ఇంటర్వ్యూలో సులభమైన ప్రశ్నలు అడిగేందుకు పలువురు అభ్యర్థుల నుంచి నగదును బినామీల అకౌంట్ల ద్వారా త్రిపాఠి స్వీకరించినట్లు తెలంగాణ, ఏపీ హెడ్‌క్వార్టర్‌ మేజర్‌ జనరల్‌ శ్రీనివాస్‌రావు సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రాథమిక విచారణ జరిపిన సీబీఐ అధికారులు గురువారం కేసు నమోదు చేశారు. త్రిపాఠితో పాటు సత్యప్రకాశ్, ఎంకే పాండే, నాయక్‌ ఆదిత్యనారాయణ్‌ తివారీ, క్రాఫ్ట్స్‌మెన్‌ ప్రవీణ్‌కుమార్‌ సారస్వత్, నాయక్‌ సుబేదార్‌ పూజాన్‌ ద్వివేదీ, లాన్స్‌నాయక్‌ జితేంద్రకుమార్‌ యాదవ్, నాయక్‌ జగదీశ్‌ నారాయణ్‌పాండే, నాయక్‌ çసుబేదార్‌ బాల్‌ కృష్ణగార్గ్, సిపాయ్‌ మద్వేంద్ర మిశ్రా, సిపాయ్‌ రాజేశ్‌కుమార్‌ గోస్వామి, నాయక్‌ సుబేదార్‌ శక్తిధర్‌తివారీపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. 

త్రిపాఠికి బినామీగా వ్యవహరించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇంద్రజీత్‌గుప్తా, మితాయిలాల్‌గుప్తా, అమర్‌నాథ్‌గుప్తా, విశ్వజీత్‌ గుప్తా, మధ్యప్రదేశ్‌కు చెందిన పంకజ్‌ బిల్తారేపై కూడా కేసులు నమోదయ్యాయి. 12 మంది అభ్యర్థులకు, నిందితులకు మధ్య     రూ.42 లక్షలకు పైగా లావాదేవీలు జరిగినట్లు    ఆర్మీ అంతర్గత విచారణలో తేలిందని సీబీఐ        వెల్లడించింది.  

మరిన్ని వార్తలు