వైఎస్‌ షర్మిల కేసులో మరో వ్యక్తి అరెస్ట్‌

3 Feb, 2019 19:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిలపై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారంపై నమోదైన కేసులో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రకాశం జిల్లా వేములకు చెందిన పెద్దిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్‌ వెంకటేష్‌ది తొలి అరెస్టు కాగా... ఆదివారం తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన నవీన్‌ను అరెస్టు చేశారు. మరికొందరు బాధ్యుల్ని గుర్తించడానికి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు యూట్యూబ్‌కు సంబంధించిన లాగిన్‌ వివరాలు ఆరా తీస్తున్నారు.

కేసు దర్యాప్తునకు కీలక ప్రాధాన్యమిస్తున్న అధికారులు నిందితుల్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. షర్మిల తన ఫిర్యాదుతో పాటు దాదాపు 60 యూట్యూబ్‌ లింకుల్ని పోలీసులకు సమర్పించారు. వీటిని పరిశీలించిన అధికారులు ఆ అభ్యంతరకరమైన కామెంట్లపై దృష్టి పెట్టారు. ఏడుసార్లు కామెంట్లు పెట్టిన వెంకటేష్‌ను శనివారం గుంటూరులో అరెస్టు చేసి తీసుకొచ్చారు.

ఆదివారం మంచిర్యాలలోని రామ్‌నగర్‌కు చెందిన అద్దూరి నవీన్‌ను కటకటాల్లోకి పంపారు. నవీన్‌ నాలుగు వీడియోల కింది భాగంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వెంకటేష్‌ను ఆదివారం ఉదయం మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. నవీన్‌ను సైతం మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచి సోమవారం రిమాండ్‌కు తరలించనున్నారు.

వృత్తిరీత్యా క్షురకుడైన ఇతను ఎందుకు అభ్యంతరకర కామెంట్లు చేశాడనే అంశాన్ని ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంలో అసలు సూత్రధారుల్ని గుర్తించాలంటే ప్రాథమికంగా ఆయా అంశాలతో కూడిన వీడియోలను సృష్టిస్తూ యూ–ట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ చేసి వివరాలు, పదేపదే కామెంట్లు పెట్టిన వారి మూలాలు తెలియాల్సి ఉంది. వారు యూ–ట్యూబ్‌ను వినియోగించే సమయంలో ఏదో ఒక ఐపీ (ఇంటర్‌నెట్‌ ప్రొటోకాల్‌) అడ్రస్‌ ఆధారంగా ఇంటర్‌నెట్‌ను యాక్సిస్‌ చేశారో గుర్తించాలి. ఈ వివరాలు కోరుతూ యూట్యూబ్‌ యాజమాన్యానికి లేఖ రాశారు. ఈ కేసులో వీడియోలు పోస్ట్‌ చేసిన వారితో పాటు కామెంట్లు చేసిన వారూ నిందితులుగా మారతారని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే 18 మందికి నోటీసులు జారీ చేసిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు