యువదొంగకి దేహశుద్ధి

24 Nov, 2018 12:13 IST|Sakshi

సాక్షి, కాజీపేట: ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధురాలిపై దాడి చేసి మెడలో ఉన్న బంగారు అభరణాలను దొంగిలించడానికి ప్రయత్నించిన యువకుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన గురువారం రాత్రి బాపూజీనగర్‌లో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం కొంపెల్లి శేషమ్మ(62) భర్త చనిపోవడంతో రైల్వే ఫించన్‌పై ఆధారపడి జీవిస్తుంది. కొడుకు వేరే ఇంటిలో ఉంటుండడంతో తాను కట్టుకున్న ఇంట్లోనే శాంతమ్మ ఒంటరిగా ఉంటుంది. ఈ విషయాన్ని పసిగట్టిన ఓ యువకుడు వృద్ధురాలి మెడలో ఉన్న నగలపై కన్నెసి గురువారం రాత్రి ఇంటి వెనుక తలుపు లేపుకుని లోపలి చోరబడి దాడి చేశాడు.

శేషమ్మ మెడలో ఉన్న బంగారు అభరణాలను తెంచుకోవడానికి ప్రయత్నించగా ప్రతిఘటిస్తునే కేకలు వేయడంతో స్థానికులు అటుగా రావడంతో బయపడి బయటకు పరుగెత్తాడు. స్థానికులు ఏం జరిగిందని అడిగి తెల్సుకుంటుండగా నేరం తనపైకి రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆ యువకుడు వృద్ధురాలి కొడుకు ఇంటికి వెళ్లి మీ అమ్మ వాళ్ల ఇంటి దగ్గర ఏదో గొడవ జరుగుతుందని చెప్పి వారితో కలిసి ఏం తెలియనట్లుగానే మళ్లీ ఘటన స్థలికి వచ్చాడు. సదరు యువకుడిని గుర్తించిన వృద్ధురాలు స్థానికులకు చూపించింది. దీంతో వారు ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు. అప్పటికే కాలనీవాసులు 100 డయల్‌కు ఫోన్‌ చేయడంతో బ్లూకోర్ట్స్‌ టీం పోలీసులు వచ్చి యువకుడిని పోలీసుస్టేషన్‌కు తరలించి వాస్తవ పరిస్థితిపై విచారణ జరుపుతున్నారు. ఈ పేనుగులాటలో వృద్ధురాలి మెడ నుంచి ఎటువంటి బంగారు నగలు పోలేదని పోలీసులు తెలిపారు.  

మరిన్ని వార్తలు