రూ. 50 వేల నగదు, చైన్‌ పోగొట్టుకున్న వ్యాపారి

18 Jun, 2019 08:05 IST|Sakshi

టీనగర్‌ : జీడి పప్పు బస్తాలు ఇస్తానని చెప్పి రూ. 50 వేల నగదు, బంగారు చైన్‌ను అపహరించిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెన్నై రాయపేట అవ్వై శన్బుగం రోడ్డులో ఈరోడ్డుకు చెందిన వెంకటేష్‌(42) జీడీ పప్పు దుకాణం నడుపుతున్నాడు. ఈ నెల 15న ఉదయం 10 గంటల సమయంలో అతనికి ఒక ఫోన్‌కాల్‌ వచ్చింది. అందులో మాట్లాడిన వ్యక్తి తన పేరు ఆనంద్‌ అని పరిచయం చేసుకున్నాడు. జీడి పప్పు హోల్‌సేల్‌ వ్యాపారం చేస్తున్నట్లు, రూ. 35 వేలు అడ్వాన్స్‌గా అందజేస్తే 300 కిలోల జీడి పప్పు ఇస్తానని, మిగతా నగదు తర్వాత ఇస్తానని తెలిపాడు. దీన్ని నమ్మిన వెంకటేష్, అతని స్నేహితుడు బాలాజీని దీని గురించి అడిగాడు.

ఈ నెల 15వ తేది అర్ధరాత్రి 12 గంటల సమయంలో బాలాజీ దుకాణానికి వెంకటేశ్‌ వెళ్లాడు. అక్కడ బాలాజీ, ఆనందన్‌ తనకు తెలిసిన వ్యక్తేనని, నగదు ఇచ్చి వెళ్లమని తెలిపాడు. అందుకు వెంకటేష్‌ తన వద్ద నగదు లేదని చెప్తుండగానే హఠాత్తుగా అతను వెంకటేష్‌ను బెదిరించి, అతని వద్దనున్న ఏటీఎం కార్డు, పిన్‌ నెంబర్‌ను తీసుకున్నాడు. తర్వాత బెదిరించిన వ్యక్తి అక్కడున్న ఏటీఎం నుంచి రూ. 50 వేలు తీసుకున్నాడు. వెంకటేష్‌ ధరించిన బంగారు చైన్‌ను లాక్కుని పరారయ్యాడు. జరిగిన విషయం గురించి కొత్వాల్‌చావడి పోలీసు స్టేషన్‌లో వెంకటేష్‌ ఫిర్యాదు చేశాడు. 

మరిన్ని వార్తలు