రెట్టింపు ఇస్తామని 100 కోట్ల మోసం

20 Oct, 2019 04:58 IST|Sakshi

చెన్నైలో దంపతుల అరెస్టు

సాక్షి ప్రతినిధి, చెన్నై: పెట్టిన పెట్టుబడికి వంద రోజుల్లో రెట్టింపు ఇస్తామంటూ జనానికి గాలం వేసి రూ.100 కోట్లకు పైగా బురిడీ కొట్టిన దంపతులను తమిళనాడు పోలీసులు అరెస్ట్‌ చేశారు. సేలం రెడ్డిపట్టి అంబేద్కర్‌నగర్‌కు చెందిన మణివణ్ణన్‌ (38), ఇందుమతి (33) దంపతులు తమ బంధువులతో కలిసి సేలం–ఓమలూరు రోడ్డులో ఆర్‌ఎంవీ గ్రూప్‌ సంస్థ ప్రారంభించారు. తమ సంస్థలో డబ్బు డిపాజిట్‌ చేస్తే వంద రోజుల్లో రెట్టింపు, మరింత కాలం డిపాజిట్‌గా ఉంచితే 25 శాతం వడ్డీ చెల్లిస్తామని ఆశచూపారు.

పోగైన భారీ సొమ్ముతో మణివణ్ణన్‌ ఫొటోలు దిగి డిపాజిట్‌దారులకు పంపేవాడు. భారీగా సమకూరిన కోట్లాది రూపాయలతో మణివణ్ణన్‌ దంపతులు గత ఏడాది ప్రారంభంలో దుబాయ్‌కు పారిపోయారు. లబోదిబోమంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు నుంచి ముందస్తు బెయిల్‌ పొందిన దంపతులు రెండు రోజుల క్రితం సేలంకు రాగా పోలీసులు శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు.  దంపతుల నుంచి రెండు లగ్జరీ కార్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, 13 సెల్‌ఫోన్లు, రెండు బంగారు గాజులు, పది సవర్ల బంగారు చైను, రూ.50 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్‌ ఖాతాల వివరాలను సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు సేకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు