-

భార్యను కలవనివ్వడం లేదని...

23 Apr, 2018 13:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పుట్టింటికి వెళ్లిన భార్యను కలవనీయకుండా అడ్డుపడుతున్నాడనే నేపంతో పిల్లనిచ్చిన మామనే కత్తితో పొడిచి చంపాడు ఓ వ్యక్తి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పు ఢిల్లీకి చెందిన నీరజ్‌ (27) ప్రైవేట్‌ ట్రావేల్‌ ఏజెన్సీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి 2016లో రాఖీ (25)తో వివాహం అయ్యింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో 2018, మార్చ్‌లో రాఖీ తన భర్త మీద గృహ హింస కేసు పెట్టింది. అప్పటి నుంచి రాఖీ శశిగార్డెన్‌లో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దే ఉంటుంది.

ఈ క్రమంలో నీరజ్‌ భార్యను తిరిగి కాపురానికి రావాల్సిందిగా కోరాడు. కానీ రాఖీ అందుకు నిరాకరించడంతో నీరజ్‌ బెదిరింపులకు దిగాడు. ఆదివారం నీరజ్‌ తన భార్యను కలవడానికి ఆమె పుట్టింటికి వెళ్లాడు. ఆ సమయంలో నీరజ్‌ మామ ప్రభు దయాల్‌ (45) తలుపు తీసి, నీరజ్‌ని ఇంట్లోకి రాకుండా అడ్డుకుని అతనితో గొడవ పడ్డాడు. సహనం కోల్పోయిన నీరజ్ తనతో పాటు తీసుకు వచ్చిన కత్తితో మామ ప్రభు దయాల్‌ను విచక్షణా రహితంగా పొడిచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన ప్రభు దయాల్‌ను సమీప ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. నీరజ్‌ కేసు నమోదు చేసి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని డిప్యూటీ కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ పంకజ్‌ సింగ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు