న్యూఢిల్లీ : తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలన్నాడనే కోపంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేశారు ఇద్దరు వ్యక్తులు. ఈ సంఘటన ఢిల్లీలోని భాల్స్వా డైరీ సమీపంలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీలోని భాల్స్వా డైరీ.. స్వామీ శారదానంద్ కాలనీకి చెందిన వడ్డీవ్యాపారి మహ్మద్ ముఖీమ్ కొన్నినెలల క్రితం షేక్ రంజాన్ అనే వ్యక్తికి 20వేల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. నెలలు గడుస్తున్నా రంజాన్ తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకపోవటంతో ఆగ్రహించిన ముఖీమ్ అతడిని డబ్బు ఇవ్వాలని, లేకుంటే పరిస్థితులు దారుణంగా ఉంటాయని బెదిరించాడు. దీంతో ముఖీమ్పై పగబట్టిన రంజాన్! స్నేహితుడి సహాయంతో అతడిని హత్య చేయటానికి పన్నాగం పన్నాడు.
పథకం ప్రకారం ముఖీమ్ను ఊరికి దూరంగా తీసుకెళ్లి.. గొంతుకోసి, విచక్షణా రహితంగా కత్తితో పొడిచి హత్యచేశారు. రక్తపు మడుగులో పడిఉన్న వ్యక్తిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. ముఖీమ్ను చివరిసారి రంజాన్తో కలిసి వెళ్లటం చూశామని స్థానికులు చెప్పారు. దీంతో రంజాన్తో పాటు అతడి స్నేహితుడ్నికూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. డబ్బు వెనక్కు తిరిగి ఇవ్వాలని బెదిరించినందుకే హత్య చేసినట్లు తెలిపారు.