లాక్‌డౌన్‌తో మానసిక స్థితి కోల్పోయి.. 

2 May, 2020 04:17 IST|Sakshi

కూతురు గొంతు కోసిన తండ్రి.. చిన్నారి అక్కడికక్కడే మృతి  

జోగిపేట: లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి లభించకపోవడంతో మానసిక స్థితి కోల్పోయిన ఓ తండ్రి కన్న కూతురునే కడతేర్చాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం గొంగ్లూర్‌ తండాలో చోటుచేసుకుంది. సీఐ బుర్రి శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. గొంగ్లూర్‌ తండాకు చెందిన రమావత్‌ జీవన్‌ దంపతులకు ముగ్గురు సంతానం. గురువారం రాత్రి కుటుంబ సభ్యులు ఇంటి ఎదుట నిద్రించారు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో రమావత్‌ జీవన్‌ మానసిక స్థితి కోల్పోయి కూతురు అవంతిక (4)ను కత్తితో గొంతు కోసి చంపాడు.

ఏమి తెలియనట్లు భార్యను లేపి బిడ్డకు ఏదో అయింది చూడు అని చెప్పాడు. అప్పటికే పాప మరణించింది. కూతురును తన భర్తే హత్య చేశాడని భార్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. కూతురును హత్య చేసింది తానేనని, ఎందుకు ఇలా చేశానో అర్థం కావడం లేదని పోలీసుల ఎదుట వాపోయాడు. అయితే ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో కొన్ని రోజులుగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, జీవన్‌ మానసిక పరిస్థితి సరిగా ఉండటం లేదని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు