అరెస్టయిన యువరాజులంతా ఎక్కడున్నారు?

8 Nov, 2017 18:25 IST|Sakshi

రియాద్‌ : అవినీతి వ్యతిరేక చర్యల్లో భాగంగా సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌ మహమ్మద్‌ బిన్‌ సుల్తాన్ ఆదేశాల మేరకు 11 మంది యువరాజులను, మంత్రులను అక్కడ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అరెస్ట్ తర్వాత వారందరిని ఎక్కడికి తరలించారు? అన్న ప్రశ్నలను పలువురు లెవనెత్తున్నారు. ఈ మేరకు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు జరిపిన అన్వేషణలో ఆశ్చర్యకర విషయం వెలుగు చూసింది. 

రియాద్‌ లోని రిట్జ్‌ కార్లటన్ విలాసవంతమైన హోటల్‌లో వారంతా సేదతీరుతున్నారు. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రెండు వారాల క్రితం వాణిజ్య ఒప్పందాల కోసం 3 వేల మంది అధికారులు, వ్యాపార వేత్తలతో ఇక్కడ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే లగ్జరీ హోటల్‌లోని బాల్‌రూమ్‌ బీ లో వారంతా నేలపై పడుకున్న దృశ్యాలు విడుదల అయ్యాయి. వారి చుట్టూ గార్డులు కాపలా ఖాయటం చూడొచ్చు. మరికొందరు వీఐపీలను కూడా ఇదే హోటల్‌లోని మరికొన్ని రూమ్‌లలో ఉంచినట్లు ది టైమ్స్ సోమవారం ఓ కథనం ప్రచురించింది. గదులేవీ ఖాళీ లేవని తమ ప్రతినిధితో చెప్పినట్లు ఆ కథనంలో టైమ్స్ పేర్కొంది. ఖరీదైన ఈ కారాగారంలో 11 మంది యువరాజులను, నలుగురు ప్రస్తుత మంత్రులను, డజనుకుపైగా మాజీ మంత్రులు, మల్టీ మిలీనియర్లు ఉన్నారు.

ఇక అరెస్టయిన వారిలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. దశాబ్దాలుగా సౌదీ వ్యాపార వ్యవస్థను శాసిస్తు‍న్న ససీర్‌ బిన్ అఖీల్‌ అల్‌ తయ్యార్ తోపాటు ఇప్పుడు బిగ్‌ షాట్ గా చెలామణి అవుతున్న ప్రిన్స్‌ అల్‌వాలీద్‌ బిన్‌ తలాల్‌  కూడా ఉన్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం అదంతా ఓ డ్రామాగా అభివర్ణించాయి. అయితే బిన్‌ సుల్తాన్ చేసిన పని సమీప భవిష్యత్తులో దుబాయ్‌ ఆర్థిక వ్యవస్థను(చమురు రంగంలో కాకుండా) దారుణంగా కుదేలు చేసే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు