లాటరీ పేరుతో టోకరా..!

7 Jun, 2018 13:02 IST|Sakshi
పోస్ట్‌ద్వారా వచ్చిన నకిలీ చెక్కు  

మోసపోయిన మహదేవునిపేట గ్రామస్తుడు

అకౌంట్‌లో రూ.40వేలు డిపాజిట్‌ చేయించుకుని బురిడీ

భార్య పుస్తెలతాడు తాకట్టు పెట్టిన బాధితుడు

బిజినేపల్లి రూరల్‌:  మీ ఫోన్‌ నంబర్‌కు రూ.12లక్షల 80వేలు లాటరీ తగిలిందంటూ బిజినేపల్లి మండలం మహదేవునిపేటకు చెందిన పొలమోని బంగారయ్యకు గుర్తుతెలియని వ్యక్తు లు ఫోన్‌లో చేశారు. వారితో మాటలు కలిపిన బంగారయ్యకు మీ పేరున వచ్చిన చెక్కు ఇదిగో అంటూ హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు పేరుతో బోగస్‌ చెక్కు ఫొటో వాట్సప్‌లో పోస్టుచేశారు.

రూ.40 వేలు అకౌంట్‌లో జమ చేస్తే ఆ చెక్కును మీకందిస్తామని నమ్మించారు. దీంతో తనభార్య మెడలోని పుస్తెల తాడును తాకట్టు పెట్టి రూ.40వేలు తెచ్చి, వారు చెప్పిన బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేశాడు బంగారయ్య. బ్యాంకు కౌంటర్‌ ఫైల్‌ను వారికి వాట్సప్‌లో పంపాడు. దీంతో పోస్టాఫీస్‌కు వెళ్లి మీ పేరు చెబితే ఓ చెక్కు ఇస్తారని వారు సూచించడంతో, అక్కడికి వెళ్లి తన పేరున పోస్టులో వచ్చి న చెక్కును తీసుకున్నాడు.

ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుండటంతో ఈ విషయం నాలుగు రోజులుగా ఎవరికీ చెప్పలేదు. బిజినేపల్లిలోని ఎస్‌బీఐకి వెళ్లి చూపడం తో బోగస్‌ చెక్కు అని చెప్పారు. దీం తో తాను మోసపోయిన విషయం అర్థమవడంతో లబోదిబోమంటున్నాడు. ఈ విష యమై బిజినేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నట్లు బంగారయ్య చెప్పాడు. మోసానికి పాల్పడిన వారి బ్యాంకుఖాతా నంబర్‌ను పరిశీలించగా బీహార్, జార్ఖండ్‌ రాష్ట్రాలకు చెందిన వారిదని తేలింది.  

మరిన్ని వార్తలు