గాయత్రి నర్సింగ్‌హోం నిర్వాహకుల అరెస్ట్‌

14 Apr, 2018 09:19 IST|Sakshi
సర్వారి ఉన్నిసా , డాక్టర్‌ రచనాసింగ్‌ , డాక్టర్‌ కిరణ్‌కుమార్‌

హైకోర్టు ఆదేశాలతోసుమోటోగా కేసు

లింగ నిర్ధారణ పరీక్షలు నిజమేనని వెల్లడి

సైదాబాద్‌: చట్ట వ్యతిరేకంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ çబ్రూణహత్యలకు పాల్పడుతున్న గాయత్రి నర్సింగ్‌హోం నిర్వాహకులను సైదాబాద్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌ప్పెక్టర్‌ కాట్న సత్తయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఐఎస్‌సదన్‌ డివిజన్, సింగరేణి కాలనీలోని గాయత్రి నర్సింగ్‌హోంలో చట్ట వ్యతిరేకంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ,  ఆడ పిల్లేనని తేలితే అబార్షన్‌లు చేస్తున్నారని ఆరోపిస్తూ అంబర్‌పేటకు చెందిన సందీప్‌యాదవ్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

దీనిపై గత మంగళవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం వైద్యులపై చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ఈ నెల 5న సైదాబాద్‌ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సైదాబాద్‌ పోలీసులు సుమోటో కేసుగా నమోదు చేసి గాయత్రి నర్సింగ్‌హోంలో జరుగుతున్న కార్యకలపాలపై విచారణ జరిపారు. అందులో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న సర్వారి ఉన్నిసా ఏడో తరగతే అయినా అబార్షన్లు చేస్తున్నట్లు గుర్తించారు. నర్సింగ్‌హోం నిర్వాహకులు డాక్టర్‌ రచనాసింగ్‌ ఠాకూర్, డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ పర్యవేక్షణలోనే ఇవి జరుగుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులను మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ యాక్ట్‌ ప్రకారం  శుక్రవారం అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పర్చగా  కోర్టు 15 రోజుల రిమాండ్‌ విధించినట్లు సీఐ వివరించారు.

మరిన్ని వార్తలు