బ్రేకప్‌ చెప్తావా అంటూ ప్రేయసిపై కాల్పులు!

6 Aug, 2018 10:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : ప్రియుడితో రిలేషన్‌ కట్ చేసుకోవడం ఓ ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ ప్రాణాల మీదకి తెచ్చింది. నాకు బ్రేకప్‌ చెప్తావా అంటూ ఓ ఆమె మాజీ ప్రియుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. రెండు రోజుల కిందట ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

ఆ వివరాలిలా.. ఢిల్లీలోని భరత్‌ నగర్‌కు చెందిన 24 ఏళ్ల యువతి ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ)గా పనిచేస్తోంది. స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్‌ ఉద్యోగి, ఆమె ప్రేమించుకున్నారు. కొంతకాలం తర్వాత మనస్పర్థలు రావడంతో వీరు విడిపోయారు. జగ్రాన్‌ మండల్‌లో పనిచేసే ప్రియుడి తీరు నచ్చక పోవడంతో ఆ సీఏ అతడికి బ్రేకప్‌ చెప్పేసంది. ఆమెపై కక్ష పెంచుకున్న ఆ యువకుడు మాజీ ప్రేయసి బంధువుల ఇంటికి వెళ్లిందన్న విషయం తెలుసుకున్నాడు. 

ప్లాన్‌ ప్రకారం తుపాకీ తీసుకుని ప్రేయసి బంధువుల ఇంటికి వెళ్లాడు. ఎవరో డోర్‌ తట్టారని ఆ సీఏ వెళ్లి చూడగా.. ఒక్కసారిగా తూటాల శబ్ధం వచ్చింది. బంధువులు వచ్చి చూడగా బుల్లెట్‌ గాయాలతో బాధితురాలు పడి ఉంది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాలకేం ప్రమాదం లేదని డాక్టర్లు చెబుతున్నారు. కాగా, బాధితురాలి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని శాదరలో అదుపులోకి తీసుకున్నట్లు ఆదివారం వెల్లడించారు. తనకు బ్రేకప్‌ చెప్పినందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు.

>
మరిన్ని వార్తలు