బీజేపీ ఎంపీ కారు ఢీకొని మహిళ మృతి

24 Aug, 2018 20:07 IST|Sakshi

తాడేపల్లి రూరల్‌: బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు కారు ఢీకొని ఓ మహిళ మృతిచెందిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద  శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో మరో మహిళ తీవ్రంగా గాయపడింది. గుంటూరు జిల్లా మంగళగిరి బాలాజీనగర్‌కు చెందిన తెన్నేరు అంజమ్మ (38), తోట శైలజలు కలసి మంగళగిరి నుంచి ఆటోలో కొలనుకొండ బయలుదేరారు. అక్కడివరకు వచ్చి, జాతీయ రహదారిపై గుంటూరు–విజయవాడ రోడ్డులో ఉన్న సాయిబాబా గుడి వద్ద దిగి  విజయవాడ–గుంటూరు రోడ్డులో ఉన్న యువ అకాడమీ వైపు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా, వేగంగా వస్తున్న ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు కారు వారిని ఢీకొట్టింది.

ఈ ఘటనలో అంజమ్మ దుర్మరణం చెందగా,  శైలజకు తీవ్ర గాయాలయ్యాయి. ఎంపీ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. డ్రైవర్‌ చాకచక్యంగా కారు బోల్తా కొట్టకుండా వ్యవహరించడంతో ఎంపీకి ప్రమాదం తప్పినట్లు పోలీసులు తెలిపారు.  వెంటనే ఎంపీ కిందకు దిగి గాయపడిన మహిళను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి, ఆయన అక్కడి నుంచి వేరే కారులో తిరిగి వెళ్లారు. రోడ్డు ప్రమాదానికి గురైన కారును తాడేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ ఎం. మణికుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు