ఉత్కంఠ: ఆ రెండు కేసుల్లో నేడే తుది తీర్పు

27 Jan, 2020 09:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రెండు కీలకమైన కేసుల్లో తుది తీర్పులు మరికాసేపట్లో వెలువడనున్నాయి. అందులో ఒకటి హాజీపూర్ కేసు కాగా.. రెండోది సమత కేసు. ఈ రెండు కేసుల్లోనూ సుదీర్ఘమైన విచారణ చేపట్టిన న్యాయస్థానాలు ఇవాళ తుది తీర్పును ప్రకటించనున్నాయి. నిందితులను ఉరి తీయాలని ప్రజలు డిమాండ్ చేస్తుండగా.. కోర్టు ఏ తీర్పును ప్రకటిస్తుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

హాజీపూర్ వరుస హత్యల కేసు.. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ముగ్గురు బాలికలను అత్యంత క్రూరంగా, పాశవికంగా అత్యాచారం చేసి బావిలో మృతదేహాలను పూడ్చి పెట్టిన ఘటన గతేడాది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి విదితమే. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు మూడు నెలల పాటు సుదీర్ఘ విచారణను చేపట్టింది. దాదాపు 300మంది సాక్షులను విచారించి.. 101 మంది సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. ఫోరెన్సిక్ నివేదిక కీలకం కానున్న ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్షను విధించేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ బలమైన సాక్ష్యాలను సమర్పించారు. అటు గ్రామస్థులు ఇటు బాధితుల కుటుంబ సభ్యులు కూడా ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న నలగొండ ఫాస్ట్‌ కోర్టు ఇవాళ తుది తీర్పును వెలువరించనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  (అంతా అబద్ధం సార్‌..)

హాజీపూర్‌ కేసు: శ్రీనివాస్‌రెడ్డిది అంతా నేర చరిత్రే 

కాగా.. కొమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో జరిగిన సమత అత్యాచారం కేసులో కూడా ఇవాళే తుది తీర్పు రానుంది. నవంబర్ 24 , 2019న తేదిన లింగాపూర్ మండలం ఎల్లపటార్ శివారులో సమత అత్యాచారం, హత్య జరిగింది. గ్రామాల్లో సంచరిస్తూ చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే బాధితురాలని ముగ్గురు వ్యక్తులు అపహరించి సామూహిక హత్యాచారం చేసి హత్య  చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన ఈ రెండు కేసుల విచారణ పూర్తయి తుది తీర్పు ఇవాళ  రానుండటంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. 

సమతపై అత్యాచారం, హత్య: చార్జిషీట్‌ దాఖలు
 

మరిన్ని వార్తలు